
1857 నాటి సిపాయిల తిరుగుబాటు ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై కూడా ఉంది. 1857, మే 10న మీరట్లో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ నవాబ్గా నాసీరుద్దౌలా ఉన్నారు. కానీ, తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకే మృతిచెందాడు. నాసీరుద్దౌలా మృతితో అఫ్జలుద్దౌలా హైదరాబాద్ నవాబ్ అయ్యాడు.
1857 తిరుగుబాటు కంటే ముందే హైదరాబాద్ ప్రజల్లో బ్రిటీష్ వారిపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఈ వ్యతిరేకత వహాబీ ఉద్యమంలో భాగంగా ముబారిక్ ఉద్దౌలా, గులాం రసూల్ఖాన్ అణచివేతతో ప్రజల్లో కలిగింది. బీరార్ ఒప్పందం కూడా ఒక కారణం. అప్పటి హైదరాబాద్ దివాన్ సాలార్జంగ్ సూచన మేరకు నిజాం అఫ్జలుద్దౌలా బ్రిటీష్ వారికి మద్దతు పలికాడు. ఈ కారణంగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైంది. మౌల్వీ అల్లా ఉద్దీన్ హైదరాబాద్లో తన ప్రసంగాల ద్వారా ప్రజలను బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఏకం చేశాడు.
ఔరంగాబాద్ తిరుగుబాటు
1857 తిరుగుబాటు ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో బ్రిటీష్ వారు పరాజయం పాలయ్యారు. దీంతో హైదరాబాద్ సంస్థానం ఆధీనంలో ఉన్న ఔరంగాబాద్ రెజిమెంట్ నుంచి కొంత మంది సిపాయిలను బ్రిటీష్ వారికి మద్దతుగా ఉత్తర భారతదేశానికి పంపుతారనే వార్త ఔరంగాబాద్ రెజిమెంట్లో వ్యాపించింది. దీనికి వ్యతిరేకంగా ఒకటో, రెండో అశ్వక దళాలకు చెందిన (ఔరంగాబాద్ కాంటిన్జెంట్ సైనికులు) మీర్ పిదా అలీ, అమీర్ఖాన్ నేతృత్వంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో మీర్ పిదా అలీ కెప్టెన్ అబ్బాట్ అనే ఆంగ్ల సైనిక అధికారిపై కాల్పులు జరిపాడు. ఇందుకుగాను అబ్బాట్ తిరుగుబాటును అణచివేసి, మీర్ పిదా అలీ అనే దాఫేదార్ను ఉరి తీయించాడు. అమీర్ఖాన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ తిరుగుబాటులో సైనికులపై ఫిరంగులతో దాడి చేయగా అమీర్ఖాన్ తప్పించుకున్నాడు.
రెసిడెంట్ కార్యాలయంపై దాడి
1857 తిరుగుబాటును మౌల్వీ అల్లావుద్దీన్, మౌల్వీ అక్బరుద్దీన్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ సమీపంలోని బొల్లారంలో గల బ్రిటీష్ సైనిక రెజిమెంటులోని జామేదార్ చిదాఖాన్ బ్రిటీష్ వారిపై తిరుగుబాటు ప్రకటించి తన అనుచరులతో హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాడు. మొదటి సాలార్జంగ్ చిదాఖాన్ను అరెస్టు చేయించి బ్రిటీష్ వారికి అప్పగించాడు. దీంతో మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ (రోహిల్లా సైనికుడు) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జులై 17న మక్కా మసీదులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిదాఖాన్ను విడిపించడానికి మొదటి సాలార్జంగ్ దగ్గరకు ఒక రాయబారిని పంపాలని తీర్మానించారు. చిదాఖాన్ విడుదలకు సాలార్జంగ్ నిరాకరిస్తే బ్రిటీష్ రెసిడెంట్ ఆఫీస్పై దాడి చేయాలని తీర్మానించారు. ఈ రాయబార విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సాలార్జంగ్ అరబ్ సైనికులను మక్కా మసీద్కు పంపించి అక్కడ సమావేశమైన వారిని చెదరగొట్టించారు.
తుర్రేబాజ్ ఖాన్
మక్కా మసీదు సమావేశం తీర్మానం ప్రకారం రోహిల్లా నాయకుడు సర్ధార్ తుర్రేబాజ్ ఖాన్ బ్రిటీష్ రెసిడెన్సీపై(ప్రస్తుతం సుల్తాన్బజార్లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయం) 1857, జులై 17న 500 మంది సైనికులతో దాడి చేశాడు. ఈ దాడిని బ్రిటీష్ అధికారి కల్నల్ డెవిడ్సన్ తిప్పికొట్టాడు. సుల్తాన్బజార్, పుత్లీబౌలీలోని డబ్బుసింగ్, జయగోపాల్దాస్ ఇండ్ల నుంచి బ్రిటీష్ రెసిడెన్సీపై రోహిల్లాలు కాల్పులు జరిపారు. బ్రిటీష్కు, రోహిల్లాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 32 మంది రోహిల్లాలు మరణించారు. ఇక్కడ నుంచి తుర్రేబాజ్ ఖాన్ తప్పించుకున్నాడు. అయితే, ఖురాన్బాన్ అలీ సహాయంతో మెదక్లోని తుప్రాన్ వద్ద తుర్రేబాజ్ఖాన్ను బ్రిటీష్ వారు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
తుర్రేబాజ్ మృతదేహాన్ని బ్రిటీష్ రెసిడెన్సీ ఎదుట రెండు రోజులపాటు వేలాడదీశారు. మౌల్వీ అల్లా వుద్దీన్ను మంగళంపల్లి వద్ద అరెస్టు చేసి అండమాన్ నికోబార్ జైలుకు 1859, జులై 28న పంపించారు. ఈ జైలులో మౌల్వీ అల్లావుద్దీన్ తొలి హైదరాబాద్ రాష్ట్ర ఖైదీగా నిలిచారు. ఇతను 1884లో అండమాన్ జైలులో మరణించాడు.