పాట్నా : బీహార్ లో అరుదైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి భార్యను మరో వ్యక్తి పెళ్లాడితే.. అతడి భార్యను బాధిత వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇది వినడానికి కాస్తా ఆశ్చర్యంగా..ఆసస్తికరంగా ఉన్నా .. ఇది నిజమే. విధి ఆడిన వింత నాటకంలో ఒకరి భార్య మరొకరికి అర్థాంగి అయ్యింది.
ఖగారియా జిల్లాలోని హార్డియా గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ సింగ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. నలుగురు పిల్లల తల్లైన నీరజ్ భార్య రూబీ దేవికి పెళ్లికి ముందు నుంచే తమ గ్రామానికి చెందిన ముకేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. పెళ్లి తర్వాత ముకేష్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ముకేష్కు కూడా వివాహమైంది. ఈయనకు ఇద్దరు పిల్లలు.
ఇక్కడ విచిత్రమేంటంటే.. ముకేష్ భార్య, ప్రియురాలు పేరు రూబీనే. గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన నీరజ్ భార్య రూబీదేవి తన ముగ్గురు పిల్లలను (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) తీసుకొని.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడు ముకేష్ను పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి నీరజ్ కుమిలిపోయాడు. తన వద్ద ఉన్న కుమార్తెతో ఒంటరిగా మిగిలపోయాడు. అంతేకాదు..ముఖేష్ భార్య రూబీ దేవి కూడా తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉండిపోయింది.
ముకేష్తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్ కుమార్ కు తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. అయితే.. ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముకేష్ మనస్సు ఒప్పుకోలేదు. దీంతో నీరజ్.. పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ముకేష్ భార్య ఫోన్ నెంబర్ ఎలాగోలా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలిశాయి.
ఇలా ఈ ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఇంట్లో నుంచి పారిపోయి.. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు జంటలు మధ్యప్రదేశ్లోని వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నారు. నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేష్ రోజు కూలీగా పని చేస్తున్నాడు.