హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 18న ఖమ్మం కలెక్టరేట్ను ప్రారంభించి.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు. ఈ సభకు మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తరలించనున్నారు.
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం పూర్తయినా.. ఈ పర్యటనలో దాని ప్రారంభోత్సవం లేదని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని కొత్తగూడెం జిల్లా నేతలు తెలిపారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవం తర్వాత ఆయా జిల్లాల అధికారులతో సీఎం సమావేశమవుతారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ను వీడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఖమ్మం పర్యటన ఆసక్తి రేపుతోంది. ధిక్కార స్వరాలు వినిపిస్తున్న నేతలను కేసీఆర్ పిలిచి మాట్లాడతారా? లేదంటే లైట్ తీసుకుంటారా? అనేది ఈ పర్యటనతో తేలిపోనుంది.