అక్కడికక్కడే బిడ్డ మృతి.. మహారాష్ట్రలో ఘటన
పాల్ఘర్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. షేరింగ్ క్యాబ్లో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్తోపాటు మరికొందరు ప్యాసింజర్లు అత్యాచారానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె ప్రతిఘటించినందుకు.. ఆమె ఒడిలోంచి పదినెలల పాపను బలవంతంగా గుంజుకొని, కారులోంచి బయటకు విసిరేశారు. పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాల్ఘర్ జిల్లాలోని పెల్హర్ ప్రాంతం నుంచి పోషెర్ ప్రాంతానికి వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం ఓ మహిళ షేరింగ్ క్యాబ్ బుక్ చేసుకుంది.
తన పదినెలల బిడ్డతో కారులో ఎక్కింది. అప్పటికే అందులో ఇద్దరు ముగ్గురు యువకులు ఉన్నారు. కారు కొంత దూరం వెళ్లాక.. డ్రైవర్తోపాటు ప్యాసింజర్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో .. కారు డ్రైవర్, మిగతావారు పది నెలల పాపను వేగంగా వెళ్తున్న కారులోంచి బయటకు విసిరేశారు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. తప్పించుకునే ప్రయత్నంలో మహిళ కూడా కారులోంచి బయటకు దూకింది. తన బిడ్డను వెతుక్కుంటూ వెనక్కి వచ్చిన బాధితురాలికి రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అప్పటికే పాప మృతిచెందిందని డాక్టర్లు తెలిపారు. మహిళ తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. డ్రైవర్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.