ఫ్రెండ్స్​కు వీడియో కాల్ చేస్తూ యువకుడి సూసైడ్

ఫ్రెండ్స్​కు వీడియో కాల్ చేస్తూ యువకుడి సూసైడ్

బేగంపేటలోని హోటల్​లో ఉరేసుకుని ఆత్మహత్య

సికింద్రాబాద్, వెలుగు: స్నేహితులకు  వీడియో కాల్  చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  బేగంపేట పోలీసు స్టేషన్​ పరిధిలో మంగళవారం జరిగింది. రామంతాపూర్  గోఖలే నగర్ కు చెందిన టి.సాంబరాజు (22)  సికింద్రాబాద్​ మహంకాళి దేవాలయ సమీపంలోని  ఓ బంగారు షాపులో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే  మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి సికింద్రాబాద్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి బేగంపేట వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో  బేగంపేటలోని  ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి చున్నీని తీసుకుని ఫ్యానుకు కట్టాడు. తన ఫ్రెండ్స్ కు వీడియో కాల్  చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. స్నేహితులు ఎంత వారించినా వినలేదు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాన్ని వీడియో కాల్ లో వారికి చూపిం చాడు. అయితే, అతని స్నేహితులు పోలీసులకు ఫోన్  చేయకుండా ఫోన్ లో ఉన్న లొకేషన్  ఆధారంగా బేగంపేటలోని హోటల్ కు చేరుకున్నారు.

హోటల్  యాజమాన్యం, సిబ్బంది సాయంతో సాంబరాజు ఉన్న గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే అతను ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాంబరాజు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. మృతుని సోదరుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే సాంబరాజు ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.