మిడ్జిల్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఇద్దరు మైనర్లకు ప్రేమ పెండ్లి జరిపించిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఈనెల 11న మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మైనర్ బాలిక తల్లి ఆ గ్రామానికి చెందిన కొందరు పెద్దలతో కలిసి ఆలయంలో పెండ్లి చేయించినట్లు సమాచారం. కాగా తన కొడుక్కి 17 ఏండ్లే ఉన్నాయని, అతడికి పెళ్లి ఇష్టం లేదని బాలుడి తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో మొరపెట్టుకున్నారు. అయినా కొందరు గ్రామస్తులతో కలిసి బాలిక తల్లి బలవంతంగా పెళ్లి జరిపించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడ్తుండగా తమకు న్యాయం చేయాలని బాలుడి తల్లి మరోసారి జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మైనర్ జంటను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిని జిల్లా బాలికల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. మైనర్ల పెండ్లి చేయించినవారిపై, సహకరించిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే తమ కొడుకును బెదిరించి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, తమ కొడుకుపైనే పోలీసులు కేసు పెట్టడంపై బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.