- రాబోయే రోజుల్లో 70 లక్షల కోట్ల వ్యాపారం
కరెంట్.. చాలా ముఖ్యమైన విషయం మనకు. అది లేనిదే పని సాగదు. ఇంటి అవసరాల దగ్గర్నుంచి కంపెనీలు, ఫ్యాక్టరీల పనుల వరకూ అదే ఇంధనం. అలాంటి కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది బొగ్గు నుంచే. కానీ, దాని వల్ల పర్యావరణానికి పెద్ద నష్టమే జరుగుతోంది. కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ గ్యాస్లు గాల్లో కలిసి వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. అందుకే సైంటిస్టులు సోలార్ (సౌర), విండ్ (గాలి) వంటి రెన్యువబుల్ (పునరుత్పాదక) ఎనర్జీ వైపు చూడాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) కూడా ఇదే విషయం చెబుతోంది. కాకపోతే రాబోయే రోజుల్లో విండ్ పవర్ (గాలి నుంచి కరెంట్ తయారీ)దే ఫ్యూచర్ అని చెప్పింది. అది కూడా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువ విండ్ పవర్ తయారవుతుందని తెలిపింది. ఇటీవల ఐఈఏ దీనిపై ఓ రిపోర్టును తయారు చేసింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ టెంపరేచర్లను 2 డిగ్రీల మేర తగ్గించాలంటే సముద్ర తీర ప్రాంతాల్లో విండ్ పవర్ను తయారు చేయడమే మేలని, ప్రపంచ అవసరాలను తీర్చాలన్నా మంచి మార్గమని చెప్పింది.
రూ.70 లక్షల కోట్ల వ్యాపారం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న కరెంట్లో సముద్ర తీరాల్లో తయారవుతున్న విండ్పవర్ వాటా 0.3 శాతం. వచ్చే రెండు దశాబ్దాల్లో (20 ఏళ్లు) అది 15 రెట్లు పెరుగుతుందని ఐఈఏ స్టడీ తేల్చింది. ఈ విండ్ పవర్ బిజినెస్ విలువ 70 లక్షల కోట్ల రూపాయల (లక్ష కోట్ల డాలర్లు)పైనే ఉంటుందని చెప్పింది. గత ఏడాది ఒక్క గిగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయడానికి దాదాపు ₹28,286 కోట్ల (400 కోట్ల డాలర్లు) మేర ఖర్చయిందని, కానీ, కొత్త విండ్ టర్బైన్ల టెక్నాలజీలతో ఆ ఖర్చు మున్ముందు భారీగా తగ్గుతుందని పేర్కొంది. వచ్చే పదేళ్లలో దాదాపు 40 శాతం మేర ఖర్చు తగ్గుతుందని వివరించింది. యూరప్లో సంప్రదాయ కరెంట్ తయారీ ఖర్చులతో పోలిస్తే విండ్ పవర్ ఖర్చు భారీగా తగ్గుతోందని చెప్పింది. 2030 నాటికి చైనాలోనూ వీటికి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.
రాజకీయంగా డెడికేషన్ అవసరం
ప్రస్తుత సంప్రదాయ కరెంట్ తయారీ పద్ధతులను ఇలాంటి పర్యావరణ హిత పద్ధతులతో రిప్లేస్ చేయాలంటే రాజకీయంగా కొంచెం డెడికేషన్ చూపించాల్సిన అవసరం ఉందని ఐఈఏ సూచించింది. ‘‘గత పదేళ్లలో కరెంట్ తయారీలో టెక్నాలజీ పరంగా రెండు పెద్ద మార్పులు జరిగాయి. అది షేల్ రెవల్యూషన్, సౌర ఫలకాలు. ప్రారంభంలో వాటికి కొంచెం ఖర్చు ఎక్కువే అయినా, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాటి ఖర్చూ భారీగా తగ్గిపోయింది. మున్ముందు విండ్ పవర్ కూడా ఈ జాబితాలో చేరుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో విండ్ పవర్కు డిమాండ్ ఎక్కువగానే ఉంది. అయితే, వివిధ దేశాల ప్రభుత్వాలు దీనిపై కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా డెడికేషన్ చూపించాల్సి ఉంది. పర్యావరణానికి హాని చేయని కరెంట్ కావాలంటే ఆ మాత్రం నిబద్ధత ఉండాలి” అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీ బిరోల్ అన్నారు. కాగా, తొలిసారిగా 1991లో డెన్మార్క్ విండ్ పవర్ టర్బైన్లను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఆ దేశం ఉత్పత్తి చేసిన మొత్తం కరెంట్లో 15 శాతం కరెంట్ తీరాల్లో ఏర్పాటు చేసిన టర్బైన్ల నుంచే తయారైంది. ప్రస్తుతం విండ్ పవర్లో బ్రిటన్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం వివిధ దేశాల్లోనూ విండ్ పవర్కు డిమాండ్ పెరుగుతోంది.
ఇండియాలో బొగ్గు డిమాండ్ తగ్గుతోంది
ఇండియాలో ప్రస్తుతం బొగ్గు నుంచే ఎక్కువ కరెంట్ తయారవుతోంది. అయితే, ఈ ఏడాది అది బాగా తగ్గిపోయింది. హైడ్రో (జల విద్యుత్), సోలార్, న్యూక్లియర్ పవర్ తయారీ పెరుగుతోంది. అక్టోబర్ చివరి నాటికి వాటి వాటా 24 వేల గిగావాట్అవర్గా ఉంది. అంటే మొత్తం కరెంట్లో వాటా 8.4 శాతం. జులైలో బొగ్గు కరెంటే ఎక్కువగా ఉన్నా, ఆగస్టులో కొంచెం తగ్గింది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బాగా పడిపోయింది. ఇనిస్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ఈ విషయం తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బొగ్గు కరెంట్ తయారీ 12,500 గిగావాట్ అవర్ తగ్గిందని ఆ సంస్థ రీసెర్చర్ చార్లీ వోరింగ్హాం అన్నారు.