
- ఇండియా తొలి ఇన్నింగ్స్లో 587 ఆలౌట్
- రాణించిన జడేజా, సుందర్
- తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 77/3
బర్మింగ్హామ్: టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (387 బాల్స్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269).. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో రికార్డుల మోత మోగించాడు. కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో ఇండియాకు భారీ స్కోరు అందించాడు. రవీంద్ర జడేజా (89) కూడా ఓ చేయి వేయడంతో.. 310/5 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 రన్స్కు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (42) ఫర్వాలేదనిపించాడు. షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 77/3 స్కోరు చేసింది. జో రూట్ (18 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్లో వరుస బాల్స్లో ఆకాశ్దీప్ (2/36) దెబ్బకు బెన్ డకెట్ (0), ఒలీ పోప్ (0) డకౌటయ్యారు. జాక్ క్రాలీ (19)ని సిరాజ్ దెబ్బకొట్టాడు. ప్రస్తుతం హోమ్ టీమ్ ఇంకా 510 రన్స్ వెనకబడి ఉంది.
కీలక భాగస్వామ్యం..
రెండో రోజు తొలి సెషన్లో పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం అందకపోయినా ఇంగ్లిష్ పేసర్లు గిల్, జడేజాపై షార్ట్ బాల్ ప్లాన్ను అమలు చేశారు. కానీ ఇది సక్సెస్ కాలేదు. దీన్ని దీటుగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ వేగంగా సింగిల్స్, డబుల్స్తో పాటు వీలైనప్పుడల్లా బాల్ను బౌండ్రీకి తరలించారు. ముఖ్యంగా జడేజా బ్యాక్ ఫుట్ షాట్లతో స్టోక్స్ బౌలింగ్ను నిలకడగా ఎదుర్కొన్నాడు. క్రిస్ వోక్స్ వేసిన బాల్ను కవర్ డ్రైవ్ క్టొటిన గిల్ రెండో రోజు తొలి బౌండ్రీని సాధించాడు. ఇక స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడటం హైలెట్. జడేజా మిడాన్లో భారీ షాట్లు కొట్టాడు. అయితే సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్కు 108వ ఓవర్లో జోష్ టంగ్ బ్రేక్ వేశాడు. అరౌండ్ వికెట్ మీదుగా టంగ్ వేసిన షార్ట్ బాల్ను జడ్డూ జంప్ చేసి కొట్టాడు. కానీ బాల్ నేరుగా కీపర్ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా ఆరో వికెట్కు 203 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ నెమ్మదిగా ఆడటంతో ఇండియా ఈ సెషన్లో 25 ఓవర్లలో 109 రన్స్ జత చేసి 419/6తో లంచ్కు వెళ్లింది.
సుందర్ సూపర్..
రెండో సెషన్లో సుందర్ అద్భుతంగా ఆడాడు. గిల్పై ఒత్తిడి తగ్గిస్తూ తాను ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్నాడు. దాంతో ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయిన గిల్ బ్యాటింగ్లో ఒక్క తప్పిదం కూడా చేయలేదు. ఫలితంగా ఇంగ్లండ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన గావస్కర్, ద్రవిడ్లను అధిగమించాడు. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత నాలుగో నంబర్ తనదేనని మరోసారి నిరూపించుకున్నాడు. షార్ట్ బాల్ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో ఇంగ్లండ్ ఎక్కువగా స్పిన్నర్ బషీర్పై ఆధారపడింది. అలాగే పార్ట్ టైమర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ను బౌలింగ్కు దించింది. కానీ గిల్.. బ్రూక్ బౌలింగ్లో ఐదు బౌండ్రీలు బాదాడు. రెండో ఎండ్లో సుందర్.. టంగ్ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇక 199 రన్స్ వద్ద గిల్... టంగ్ బాల్ను ఫైన్ లెగ్ వైపుకు మళ్లించి డబుల్ సెంచరీని అందుకున్నాడు. 139వ ఓవర్లో రూట్.. సుందర్ను ఔట్ చేసి ఏడో వికెట్కు 144 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఈ క్రమంలో ఇండియా 564/7 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది. బ్రేక్ తర్వాత ఇండియా మరో 10 ఓవర్లు మాత్రమే ఆడి మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగు ఓవర్ల తర్వాత గిల్ను టంగ్ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే ఆకాశ్దీప్ (6), సిరాజ్ (8) వెనుదిరగడంతో ఇండియా 587 రన్స్తో పటిష్ట స్థితిలో నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 151 ఓవర్లలో 587 ఆలౌట్ (గిల్ 269, జడేజా 89, బషీర్ 3/167). ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 77/3 (బ్రూక్ 30*, రూట్ 18*, ఆకాశ్ దీప్ 2/36).