
మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్
పారిస్ అగ్రిమెంట్లో అమెరికా తిరిగి చేరడంపై ఫైర్
ఒక్క నెలలోనే ‘అమెరికా ఫస్ట్ నుంచి’ ‘అమెరికా లాస్ట్’
అనే పరిస్థితి వచ్చిందని కామెంట్
వాషింగ్టన్: ఇండియా, చైనా, రష్యాలపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు. ‘‘ఇండియా, చైనా, రష్యా దేశాల కన్నా.. అమెరికా చాలా క్లీన్ గా ఉంటది. అలాంటప్పుడు పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో తిరిగి చేరాలని ప్రెసిడెంట్ జో బైడెన్ నిర్ణయం తీసుకోవడం అమెరికాకు ఏ విధంగా మంచిది?” అని ఆయన ప్రశ్నించారు. ప్రెసిడెంట్ పదవి నుంచి జనవరి 20న వైదొలగిన ట్రంప్ తొలిసారిగా ఆదివారం ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండోలో ‘కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. అమెరికా ఎలాంటి బేరసారాలుజరపకుండానే, ఖరీదైన పారిస్ అగ్రిమెంట్లో చేరడం సరికాదన్నారు. ‘‘పొల్యూషన్ను తగ్గించేందుకు చైనా పదేళ్లుగా ఎలాంటి చర్యలు ప్రారంభించలే. రష్యా కూడా పాత విధానాలనే కొనసాగిస్తోంది. మనం మాత్రం భారీగా ఖర్చుచేస్తున్నాం. మన వద్ద గాలి, నీళ్లు క్లీన్ గా ఉన్నాయి. కానీ ఇండియా, చైనా, రష్యా పొల్యూషన్ రిలీజ్ చేస్తూ ఉంటే మనకు మంచి ఎలా జరుగుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కిందటేడాది ట్రంప్ హయాంలో అమెరికా పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలగింది. ఆ సందర్భంగానూ ట్రంప్ ఇండియా, చైనా, రష్యా మురికి దేశాలని కామెంట్ చేశారు. కాగా, కొత్త ప్రెసిడెంట్ బైడెన్ నిర్ణయంతో.. అమెరికా గత నెల 19న ఈ అగ్రిమెంట్లో తిరిగి చేరింది.
2024లో మళ్లీ పోటీ..
జో బైడెన్ పాలనలో ఒక్క నెలలోనే ‘అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’ అనే పరిస్థితి వచ్చిందని ట్రంప్ అన్నారు. బైడెన్ అమెరికాను సోషలిజం వైపు తీసుకెళ్తున్నారని, తాము దేశాన్ని ఆ దిశగా పోనియ్యమన్నారు. రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లోనూ మూడోసారి ప్రెసిడెంట్గా పోటీ చేయనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ‘‘మనం మళ్లీ ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తాం. సెనేట్ను గెలుచుకుంటాం. అప్పుడు వైట్ హౌస్కు మళ్లీ రిపబ్లికన్ ప్రెసిడెంట్ వస్తారు” అని ట్రంప్ అన్నారు. కొత్త పార్టీ పెడితే కన్జర్వేటివ్స్ ఓట్లు చీలతాయని, అందుకే డెమోక్రాట్లను ఓడించేందుకు తన మద్దతుదారులను ఏకం చేస్తానని అన్నారు. బైడెన్ సర్కార్ జాబ్స్, ఫ్యామిలీ, బార్డర్స్, విమెన్, సైన్స్కు వ్యతిరేకమైన పాలసీలను అనుసరిస్తోందని విమర్శించారు. ట్రంపిజం అంటే స్ట్రాంగ్ బార్డర్లని చెప్పారు. అక్రమ ఇమిగ్రెంట్లకు బైడెన్ సర్కారు బార్డర్లు తెరుస్తోందని ఆరోపించారు.