సౌత్ ఏషియా గేమ్స్లో ఇండియా డబుల్ సెంచరీ కొట్టింది. స్విమ్మర్లు, రెజ్లర్లు సత్తా చాటడంతో ఆరో రోజు శనివారం 29 గోల్డ్ సహా 49 మెడల్స్ ఇండియా ఖాతాలో చేరాయి. దీంతో మెడల్ కౌంట్ డబుల్ సెంచరీ దాటడమే కాకుండా గోల్డ్ మెడల్స్లోనూ ఇండియా సెంచరీ కొట్టింది. 110 గోల్డ్, 69 సిల్వర్, 35 కాంస్యాలతో కలిపి మొత్తం 214 మెడల్స్ సాధించిన ఇండియా మెడల్స్ ట్యాలీలో టాప్ ప్లేస్లోను కొనసాగుతోంది. ఇండియా తర్వాత నేపాల్, శ్రీలంక(గోల్డ్ మెడల్ కౌంట్ ఆధారంగా) వరుసగా రెండు, మూడు స్థానాల్లోఉన్నాయి.
అదరగొట్టిన స్విమ్మర్లు..
శనివారం పోటీల్లో స్విమ్మర్లు ఇండియాకు అత్యధికంగా తొమ్మిది మెడల్స్ అందించారు. ఇందులో ఏడు గోల్డ్ మెడల్స్, ఓ సిల్వర్, ఓ బ్రాంజ్ ఉంది. శ్రీహరి నటరాజ్(100 మీటర్ల బ్యాక్స్ట్రోక్), రిచా మిశ్రా(800 మీటర్ల, ఫ్రీ స్టయిల్), ఎస్ శివ(400 ఇండివిడ్యూవల్ మెడ్లే), మానా పటేల్(100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్), చహత్ అరోరా(50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్), ఎస్పీ లిఖిత్(50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్), రుజుత భట్(50మీటర్ల ఫ్రీ స్టయిల్) తమతమ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో ఏవీ జయవీణ సిల్వర్ మెడల్ సాధించగా, రిధిమా వీరేంద్రకుమార్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లో కాంస్యం గెలిచాడు. ఓవరాల్ ఈ పోటీల్లో స్విమ్మర్లు 30 మెడల్స్ అందించారు.
రెజ్లర్ల ఉడుంపట్టు
రెజ్లర్లు నాలుగు గోల్డ్ మెడల్స్ గెలిచారు. సత్యవర్త్ కడియన్(97 కేజీ ఫ్రీ స్టయిల్), సుమిత్ మాలిక్(125 కేజీ ఫ్రీ స్టయిల్), గుర్షన్ప్రీత్కౌర్(విమెన్స్ 76 కేజీ), సరిత మోర్(విమెన్స్ 57 కేజీ) గోల్డ్ మెడల్స్ గెలిచారు.
షూటింగ్లో మూడు గోల్డ్లు
గేమ్స్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చూపిస్తున్న ఇండియా షూటర్లు ఆరో రోజు మూడు గోల్డ్ మెడల్స్ అందించారు. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో అనీశ్ భన్వాలా గోల్డ్ సాధించాడు. అనంతరం అనీశ్, భాబేశ్ షెకావత్, ఆదర్శ్ సింగ్ జోడీ మెన్స్ టీమ్ గోల్డ్, మొహులీ ఘోష్– యష్ వర్ధన్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ గోల్డ్ నెగ్గింది. మరోపక్క వెయిట్ లిఫ్టర్లు శాస్త్రి సింగ్ (81 కేజీ), అనురుధ (87 కేజీ) గోల్డ్ మెడల్స్ సాధించారు. అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆరో రోజు గోల్డ్ సాధించలేకపోయినా ఎనిమిది పతకాలు రాబట్టారు. రష్పాల్ సింగ్(మారథన్), మొహుమ్మద్ అఫ్సల్(800 మీటర్లు), శివ్పాల్సింగ్(జావెలిన్ త్రో)తోపాటు మెన్స్ 400 మీటర్ల రిలే టీమ్ సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో 47(12 గోల్డ్, 20 సిల్వర్, 15 బ్రాంజ్) మెడల్స్తో అథ్లెటిక్స్లో ఇండియా టాప్ ప్లేస్ సాధించింది. స్క్వాష్లో ఇండియాకు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల ఫుట్బాల్ టీమ్తోపాటు, ఏడుగురు బాక్సర్లు ఫైనల్ చేరి మెడల్స్ ఖాయం చేసుకున్నారు.


