
బెకెన్హామ్ (ఇంగ్లండ్): ఇండియా, ఇంగ్లండ్ అండర్–19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ కెప్టెన్ హమ్జా షేక్ (112) సెంచరీతో సత్తా చాటడంతో మంగళవారం రాత్రి ముగిసిన ఈ పోరులో ఆతిథ్య జట్టు ఓటమి తప్పించుకుంది. 350 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో మ్యాచ్ చివరకు ఇంగ్లండ్ 63 ఓవర్లలో 270/7 రన్స్ చేసింది. బెన్ మేయెస్ (51), థామస్ రేవ్ (50) కూడా రాణించారు. ఆఖరి రోజు చివరి గంటలో వరుస ఓవర్లలో రెండు రనౌట్స్ చేసిన ఇండియా కుర్రాళ్లు విజయం సాధించేలా కనిపించారు.
కానీ, చివర్లో రాల్ఫీ ఆల్బర్ట్ (37 బాల్స్లో 9 నాటౌట్), జాక్ హోమ్ (36 బాల్స్లో 7 నాటౌట్) పట్టుదలగా క్రీజులో నిలిచి ఇంగ్లిష్ టీమ్కు ఓటమి తప్పించారు. ఇండియా బౌలర్లలో అంబరీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 128/3తో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 248 రన్స్కు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా(63), అంబరీశ్ (53) ఫిఫ్టీలతో మెరిశారు. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు ఈ నెల 20 నుంచి చెమ్స్ఫోర్డ్లో జరుగుతుంది.