- వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం.. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం
- సర్వే , గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కారు
- వానాకాలం డేటానే ప్రామాణికం..
- ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు
- రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా
- త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికీ కాకుండా, వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని, అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. రాష్ట్రంలో ఉన్న పట్టాభూమిలో 8-–12% సాగులో తేడా(20 లక్షల ఎకరాలు) కనిపిస్తున్నట్టు తేలింది.
శాటిలైట్ సర్వే వివరాలను సర్కారుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారునున్నది. శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతోపాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి, అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
20 లక్షల ఎకరాలు ఖాళీ
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు. విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తిచేశారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి 1.53 కోట్ల ఎకరాలు కాగా, ఇందులో 8 నుంచి 12 శాతం వరకు అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వేలో తేలింది. గత వానాకాలం పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనున్నది. దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు తక్కువ కావడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్య భూమి ఉంటే, 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి.
92 శాతం కచ్చితత్వం
శాటిలైట్ సర్వేకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇమేజెస్ను ప్రతి 12 రోజులకు సేకరిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ (ఎస్ఏఆర్ ఎంఏపీ) సంస్థతో ఒప్పందం చేసుకుని, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నారు. 4 నెలల పంట కాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా విశ్లేషణ చేసి, 92 శాతం కచ్చితత్వాన్ని సాధిస్తున్నట్టు క్షేత్ర స్థాయి పరిశీలనల్లో తేలింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు, రిమోట్ సెన్సింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. మున్ముందు సొంతంగానే ఈ వ్యవస్థను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పంటల బీమా నుంచి పారదర్శకత వరకు..
ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడనుంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకే చేరేలా ఈ లెక్కలు సహాయపడతాయి. సాగు భూములను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి క్షేత్ర స్థాయి అధికారులు విశ్లేషణ చేస్తారని అధికారులు చెప్తున్నారు. చీడపీడలు, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఈ టెక్నాలజీని వినియోగిస్తారు.
పైలెట్ ప్రాజెక్టు సక్సెస్.. రాష్ట్రవ్యాప్త అమలుకు సన్నాహాలు
గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. 20 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా శాటిలైట్ సర్వే నిర్వహించింది. నిరుడు డిసెంబర్ 20 నుంచి 23 వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ప్రక్రియ పూర్తి చేసి, సాగు భూములను కచ్చితంగా లెక్కించారు.
ఇదివరకే నిర్ణయం
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని, గ్రామాల్లో సర్వే నంబర్లవారీగా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి కచ్చిత వివరాలు సేకరించి లోటు పాట్లు సరిచేస్తారని సమాచారం. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన పంటల వివరాలను ఈనెల 14 తర్వాత సర్కారుకు అందిస్తే, టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనున్నది.
