హైడ్రోజన్​ బండ్లపై ఇండియా ఫోకస్​

హైడ్రోజన్​ బండ్లపై ఇండియా ఫోకస్​

జపాన్​ రీసెర్చ్​ను క్లోజ్​గా పరిశీలిస్తున్న ఇండియా
ఫ్యుయెల్​ సెల్​ టెక్నాలజీతో నడిచే వాహనాలు
నో పొల్యూషన్​..నీళ్లే బై ప్రొడక్ట్​హైడ్రోజన్​ తయారీనే పెద్ద సమస్య
దాని తయారీకి శిలాజ ఇంధనాల అవసరం

కాలుష్యం పెరిగిపోతోంది. మంచి గాలిని మనసారా పీల్చుకునే రోజులు తక్కువైపోతున్నాయి. ముక్కులు, నోటికి మాస్కులు కట్టుకుని బయటకు పోవాల్సిన రోజులు వచ్చేశాయి. ఢిల్లీ సహా కొన్ని సిటీల్లో పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మరి, దానికి మంచి పరిష్కారమే లేదా? అంటే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్న పరిష్కారం ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ (ఈవీ– కరెంటుతో నడిచే బండ్లు). ఇప్పుడిప్పుడే ఇండియాలో ఆ కాన్సెప్ట్​ నడుస్తోంది. కొద్దికొద్దిగా జనం వాటివైపు చూస్తున్నారు. కానీ, ఇటీవల సుప్రీం కోర్టు హైడ్రోజన్​తో నడిచే వాహనాలను రోడ్ల మీదకు తీసుకొచ్చే అంశంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇండియా కూడా ఇప్పుడు వాటి వైపు చూస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని బాగా అభివృద్ధి చేస్తున్న జపాన్​ను ఫాలో అవుతోంది. వచ్చే ఏడాది జులైలో టోక్యో ఒలింపిక్స్​ జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చిపోయే గెస్టులు, ప్రయాణికుల కోసం వేలాది సంఖ్యలో హైడ్రోజన్​తో నడిచే కార్లు (ఫ్యుయెల్​ సెల్​ టెక్నాలజీ అని కూడా పిలుస్తున్నారు), బస్సులను తిప్పాలని జపాన్​ నిర్ణయించింది. క్యుషు యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్​ రీసెర్చ్​ సెంటర్​ ఫర్​ హైడ్రోజన్​ ఎనర్జీలో దానిపై రీసెర్చ్​ నడుస్తోంది. ఆ రీసెర్చ్​ను చాలా క్లోజ్​గా మన దేశం పరిశీలిస్తోంది.

ఫ్యుయెల్​ సెల్​ ఎట్లా పనిచేస్తుంది?

హైడ్రోజన్​తో నడిచే బండ్లను ఫ్యుయెల్​ సెల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ (ఎఫ్​సీఈవీ) అనీ పిలుస్తారు. ఎలక్ట్రోకెమికల్​ ప్రక్రియ ద్వారా కరెంట్​ను తయారు చేసేందుకు హైడ్రోజన్​, ఆక్సిజన్​ను ఇంధనంగా వాడుకోవడమే ఈ ఫ్యుయెల్​ సెల్​ టెక్నాలజీ. మామూలు బండ్లకు పెట్రోల్​, డీజిల్​ పోసినప్పుడు బయటకు పొగ వస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే, హైడ్రోజన్​, ఆక్సిజన్​లను ఇంధనంగా వాడుకున్నప్పుడు ‘నీళ్లు’ బయటకు వస్తాయి. కాబట్టి కాలుష్యం అన్న మాటే ఉండదు. మామూలు కార్లలో ముందు బానెట్​ కింద బ్యాటరీలున్నట్టే, ఈ ఎఫ్​సీఈవీల్లో హైడ్రోజన్​ ఫ్యుయెల్​ సెల్స్​ ఉంటాయి. ఆ సెల్సే కెమికల్​ ఎనర్జీని/రసాయన శక్తి (ఇక్కడ హైడ్రోజన్​, ఆక్సిజన్​) ఎలక్ట్రికల్​ ఎనర్జీ/ విద్యుచ్ఛక్తి (కరెంట్​)గా మారుస్తాయి. ప్రపంచంలో హైడ్రోజన్​ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి, బండ్లకు దీనిని ఇంధనంగా వాడుకోవడం చాలా ఈజీ అని సైంటిస్టులు చెబుతున్నారు.

ఈవీనా లేదా మామూలు బండా?

మామూలుగా ఈవీలు బ్యాటరీలతో నడుస్తాయి. అంటే వాటికి చార్జింగ్​ పెట్టాలి. చార్జింగ్​ ఉన్నంత సేపే బండి నడుస్తుంది. ఎప్పటికప్పుడు బ్యాటరీని చార్జ్​ చేస్తూ ఉండాలి. కానీ, ఫ్యుయెల్​ సెల్​ టెక్నాలజీ దానికి భిన్నం. దీంట్లో ఎనర్జీని స్టోర్​ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, మామూలు బండ్లలో పెట్రోల్​, డీజిల్​ను పోసుకున్నట్టే కార్లు, లేదా బస్సుల్లో పెట్టే హైడ్రోజన్​ ట్యాంకుల్లో హైడ్రోజన్​ను నింపుకోవాల్సి ఉంటుంది. ఆ హైడ్రోజన్​ ఇంధనం ఫ్యుయెల్​సెల్​లోకి వెళ్లి ఆక్సిజన్​తో రియాక్ట్​ అయ్యి కరెంట్​ను పుట్టిస్తుంది. ఆ కరెంట్​తోనే బండి ఇంజన్​ నడుస్తుంది. కాబట్టి కొద్దిగా మామూలు బండ్లతో పోలిక ఉన్నా, ఆ మామూలు వాహనాల్లో ఉన్నట్టు ఈ ఫ్యుయెల్​ సెల్​లో కదిలే భాగాలుండవు. ఇంధనం మండడమూ ఉండదు. ఇందులో జరిగేదంతా కెమికల్​ ప్రాసెస్​ అంతే. కాబట్టి ఇది కొంచెం ఈవీ, కొంచెం మనం ఇప్పుడు వాడే వాహనం అని అనుకోవచ్చు.

లాభాలు.. నష్టాలు

మామూలు వాహనాలతో పోలిస్తే ఈ హైడ్రోజన్​ బండ్లతో కాలుష్యం అనేది ఉండదు. కేవలం నీళ్లే వస్తాయి కాబట్టి.. గాలి పాడు కాదు. జనాలకు ఆరోగ్య సమస్యలూ రావు. మంచి హైడ్రోజన్​ ఫ్యుయెల్​ సెల్స్​ను పెట్టుకుంటే ఇంధనాన్ని తక్కువగా వాడుకుంటూ ఎక్కువ కాలం మన్నుతాయి. ఈవీలకు చార్జింగ్​ పెట్టాలి. వాటికి చార్జింగ్​ పోర్టులుండాలి. కానీ, హైడ్రోజన్​ బండ్లకు మామూలు పెట్రోల్​ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకునే వీలుంటుంది. చేయాల్సిందల్లా ఆయా పెట్రోల్​ బంకుల్లో దానికంటూ వసతులు కల్పించడమే. అయితే, లాభాలెన్ని ఉన్నాయో నష్టాలూ కొద్దో గొప్పో ఉన్నాయి. వాహనాలకు ప్రధాన ఇంధనం హైడ్రోజనే కాబట్టి, దాన్ని తయారు చేయడం పెద్ద ప్రాసెసే. హైడ్రోజన్​ను తయారు చేసేందుకు మళ్లీ పెట్రోల్​, డీజిల్​ వంటి శిలాజ ఇంధనాలనే వాడుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడే హైడ్రోజన్​ వాహనాల పర్యావరణ హితాన్ని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇంకో సమస్య భద్రత. పెట్రోల్​తో పోలిస్తే హైడ్రోజన్​కు పేలుడు స్వభావం చాలా ఎక్కువ. ఒకవేళ అనుకోని సంఘటనల్లో అది పేలితే కలిగే నష్టం ఎక్కువే ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్​ను నింపే ట్యాంకులను అత్యంత పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్సిడెంట్​ అయినా, బుల్లెట్లు తగిలినా వాటికి నష్టం జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఆ దిశగా టయొట మిరాయ్‌‌, హోండా హైడ్రోజన్‌‌ కారు క్లారిటీలు ముందడుగు వేశాయి. ట్యాంకులను పటిష్టంగా తయారు చేస్తున్నాయి. క్రాష్​ టెస్టుల్లో అవి పాసయ్యాయి. మూడు లేయర్ల కార్బన్​ ఫైబర్​తో ట్యాంకులను అవి తయారు చేశాయి. మరో సమస్య, వాటి రేటు. ఈవీలతో పోలిస్తే హైడ్రోజన్​ బండ్ల రేటు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఈవీల్లో రకాలు

మామూలుగా ఈవీలు నాలుగు రకాలు. బీఈవీ. అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​. వీటికి ఇంధన ట్యాంకులేవీ ఉండవు. బ్యాటరీకి చార్జింగ్​ పెట్టుకుని దూసుకెళ్లిపోవడమే.     హెచ్​ఈవీ. అంటే హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​. మామూలు పెట్రోల్​ లేదా డీజిల్​ మండి నడిచే సిస్టం, ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టమ్​ కలిసి ఉన్న ఈవీలు. దీని వల్ల ఇంధన వాడకం తగ్గుతుంది. దీంట్లో బ్యాటరీకి చార్జింగ్​ పెట్టాల్సిన అవసరం లేదు. బండి నడిచేటప్పుడు విడుదలయ్యే ఎనర్జీతోనే బ్యాటరీ చార్జ్​ అవుతుంది. పీహెచ్​ఈవీ. ప్లగ్​ ఇన్​ హైబ్రిడ్​ వెహికిల్స్​. అంటే బీఈవీ, హెచ్​ఈవీ కలగలిసి ఉండే టెక్నాలజీ. హెచ్​ఈవీలా రెండు సిస్టమ్​లూ పనిచేస్తాయి. అయితే, బ్యాటరీకి మాత్రం చార్జింగ్​ పెట్టుకోవాలి. ఎఫ్​సీఈవీ. ఫ్యుయెల్​ సెల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​. అంటే హైడ్రోజన్​ వెహికిల్స్​.

మన దగ్గర పరిస్థితేంటి?

ప్రస్తుతం మన దగ్గర హైడ్రోజన్​ వాహనాలకు సంబంధించిన ప్రాసెస్​ పెద్దగా ఏం జరగట్లేదు. మనమింకా కరెంట్​ వాహనాల వద్దే ఆగిపోయాం. వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులను 12 శాతానికి తగ్గించింది. ఎఫ్​సీఈవీలపై మామూలు వాహనాలకుండే ట్యాక్సునే ఇప్పుడు వేస్తున్నారు. విద్యాసంస్థల్లో హైడ్రోజన్​ వెహికిల్స్​పై పరిశోధనలను ప్రోత్సహించేందుకు న్యూ అండ్​ రెన్యువబుల్​ ఎనర్జీ శాఖ, రీసెర్చ్​ డెవలప్​మెంట్​ అండ్​ డెమాన్​స్ట్రేషన్​ ప్రోగ్రామ్​ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 14 ప్రాజెక్టులపై పరిశోధన సాగుతోంది. 2016–17 నుంచి 2018–19 మధ్య 8 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్​లోని నాన్​ఫెర్రస్​ మెటీరియల్స్​ టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్​, ఐఐటీ బాంబేలు కలిసి చేస్తున్న పరిశోధనలకూ సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ ప్రోత్సాహాన్నిస్తోంది. ఈ నెట్​వర్క్​లో ఐఐటీలు, ఐఐఎస్​సీ బెంగళూరు సహా పది సంస్థలు పనిచేస్తున్నాయి.