
- త్వరలో ప్లాంట్ పెడతామన్న ఫుజిఫిల్మ్
- ఆఫీస్ను ఏర్పాటు చేయనున్న టోక్యో ఎలక్ట్రాన్
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన సెమికండక్టర్ కంపెనీ ఫుజిఫిల్మ్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ కంపెనీ జనరల్ మేనేజర్ టెట్సుయా ఇవాసాకి సెమికాన్ ఇండియా 2025 కార్యక్రమంలో మాట్లాడారు. భారత్కు సెమికండక్టర్ తయారీ, సరఫరా నిర్వహణ, కొత్త టెక్నాలజీలు, ఇన్నోవేషన్, కెపాసిటీ పెంచుకోవడం వంటి అంశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. మైక్రాన్ వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఇండియాలో తయారీ మొదలు పెట్టాయని, ఇందుకు కారణం ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండడమేనని అభిప్రాయపడ్డారు. టీఎస్ఎంసీ, గ్లోబల్ఫౌండరీస్ వంటి చిప్ తయారీ కంపెనీలకు వాఫర్ ప్రాసెసింగ్ మెటీరియల్స్ను ఫుజిఫిల్మ్ సరఫరా చేస్తోంది. ఇవాసాకి ప్రకారం, గుజరాత్లోని ధోలేరాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కంపెనీ ఆసక్తి చూపిస్తోంది. సొంతంగా ఉత్పత్తి చేయడం, భారత కంపెనీల ద్వారా లైసెన్స్ ఉత్పత్తి, సెమికండక్టర్ తయారీదారులతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం..ఈ మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
గుజరాత్లో టోక్యో ఎలక్ట్రాన్ ఆఫీస్..
జపాన్కు చెందిన సెమికండక్టర్ పరికరాల తయారీ సంస్థ టోక్యో ఎలక్ట్రాన్ భారత్లో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న ఫ్యాబ్, అసెంబ్లీ, టెస్ట్ యూనిట్లకు మద్దతుగా గుజరాత్లోని ధోలేరా, అస్సాంలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రతినిధి టకేషి ఓకుబో ప్రకారం, ధోలేరా కార్యాలయం టాటా ఫ్యాబ్ ప్రాజెక్ట్కు అనుగుణంగా 200–300 ఇంజనీర్ల సామర్థ్యంతో, శిక్షణ కేంద్రం, పార్ట్స్ వేర్హౌస్తో ఏర్పాటవుతుంది. అస్సాంలోని కార్యాలయం చిన్నదిగా ఉండనుంది. భారత్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే ముందు ఏఐ, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ ఆర్ అండ్ డీలో పాల్గొనాలని కంపెనీ భావిస్తోంది.