IPL Players Injury: ప్లేయర్స్ కు గాయాల బెడద.. ఐపీఎల్ జట్లకి వరుస షాక్స్

IPL Players Injury: ప్లేయర్స్ కు గాయాల బెడద.. ఐపీఎల్ జట్లకి వరుస షాక్స్

IPL Players Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లకు చెందిన ఆటగాళ్లను గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి టీమ్స్  తమ కీలక ఆటగాళ్ల ఫిట్నెస్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కొన్ని జట్లకు ఇది బిగ్ షాక్‌గా మారిపోయింది. 

కేకేఆర్ కి షాక్: 
ఈ ఎడిషన్‌కు ముందు మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్ పేసర్ మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని స్థానంలో ఆకాశ్ మధ్వాల్ లేదా చేతన్ సకారియాను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక బౌలర్ మతీషా పతిరాన పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు కూడా ఈ సీజన్‌లో ఆడే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అదనంగా రాజకీయ ఉద్రిక్తతలతో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా ఈ సీజన్‌లో కేకేఆర్‌కు అందుబాటులో ఆడటం లేదు. అతని స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి రిటైన్ చేసుకున్నారు. 

ఆందోళనలో ఆర్సీబీ:  
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి కూడా గాయాల సమస్యలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం పక్కటెముకల గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. అందువల్ల ఐపీఎల్ ప్రారంభ దశలో అతడు అందుబాటులో ఉండకపోవచ్చని టాక్. ఇంకోవైపు పేసర్ యశ్ దయాల్ వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకోవడంతో అతడు ఆడే విషయంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలతో కేసుల్లో ఇరుకున్నాడు. 
 
గాయంతోనే ఎస్ఆర్హెచ్ కెప్టెన్: 
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ కూడా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకుంటానని కమిన్స్ తాజాగా వెల్లడించాడు. అలాగే మరో ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సైతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్‌లో ఎస్ఆర్హెచ్ తరఫున అద్భుతంగా రాణించిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ కూడా గాయపడి చికిత్స పొందుతున్నాడు. 

►ALSO READ | బంగ్లాదే వన్డే సిరీస్‌‌‌‌.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి

ఇంకా న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే ఫిట్నెస్ సమస్యలతో తీవ్ర సతమతమవుతున్నాడు. గతేడాది జరిగిన వేలంలో అతడిని రాజస్థాన్ జట్టు రూ.2.25 కోట్లకు దక్కించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా గాయపడుతూ.. టీ20 ప్రపంచకప్ మధ్యలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ సైతం ప్రస్తుతం అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆయా జట్లకు చెందిన ఆటగాళ్ల గాయాల సమస్యలు పెద్ద సవాలుగా మారాయి.