బషీర్బాగ్, వెలుగు: స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీసీఐ భారత్–పాక్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం ఎదుట బీసీసీఐ డౌన్ డౌన్, ఐసీసీ చైర్మన్ జై షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం పాక్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ.. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను కిరాతకంగా చంపితే బీసీసీఐ ఆ దేశంతో మ్యాచ్ ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. నాయకులు బుర్ర రాములు, విజయ్ మల్లంగి, హేమ జిల్లోజు, శివాజీ, దర్శనం రమేశ్, రాకేశ్ రెడ్డి తదితరులున్నారు.
