
‘వీడు ఆరడుగుల బుల్లెట్టు’ అనే సూపర్ హిట్ సాంగ్ వినే ఉంటారు. ఆరుడుగులు ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ దేశంలో అంత హైట్ ఉన్నోళ్లు చాలా తక్కువ. మన దగ్గర మెజార్టీ ప్రజల ఎత్తు 5 ఫీట్ల నుంచి 5.5 ఫీట్లే. పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇండియన్ల సగటు ఎత్తు తక్కువే. పిల్లలకు ముర్రు పాలు పట్టించకపోవడం, మూడేళ్లలోపు వాళ్లకు ఇచ్చే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్లే మనోళ్లు ఎత్తు పెరగడం లేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ సైంటిస్టుల పరిశోధనలో తేలింది. పిల్లలు ఆరోగ్యం బాలేనపుడు తొందరగా చికిత్స చేయించకపోవడం, బూజు పట్టిన ఆహారం తినడం, పిల్లలుండే ప్రదేశాల్లో అపరిశుభ్రత కూడా కారణమని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను గురువారం ఎన్ఐఎన్లో ఇంటర్నేషనల్ సెమినార్ సందర్భంగా ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మయ్య వెల్లడించారు. ఈ ఐదు సమస్యలను అధిగమిస్తే పిల్లు ఇట్టే హైట్ పెరుగుతారని చెప్పారు.
కేరళ బెస్ట్
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన ఎత్తు సమస్య ఎక్కువ. 2015-–16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేప్రకారం.. ఇండియాలోని మగవారి సగటు ఎత్తును ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ పురుషులు 30 దేశాల్లోని సగటు పురుషుల కంటే హైట్ ఎక్కువే ఉన్నారు. యూపీ, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్లోని పురుషులు తక్కువ ఎత్తున్నారు. పంజాబ్, కాశ్మీర్, కేరళ, హర్యానా మహిళలు 40కిపైగా దేశాల్లోని మహిళల కన్నా ఎత్తున్నారు. రెండు దశాబ్దాలుగా కేరళ ప్రజల హైట్లో పెరుగుదల బాగుంది. గత దశాబ్దంలో హిమాచల్ ప్రదేశ్లోనూ మెరుగుదేల కనిపించింది. కర్నాటక, హర్యానా, జార్ఖండ్ పురుషుల ఎత్తు తగ్గుతోంది.
రాష్ట్రంలో 28 శాతం స్టంటింగ్ రేటు
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడం(స్టంటింగ్ రేటు) 28.5 శాతం నమోదైంది. 38 శాతం స్టంటింగ్ రేటుతో ఆదిలాబాద్ రాష్ట్రంలో టాప్లో ఉంది. తర్వాతి స్థానాల్లో మహబూబ్నగర్ ( 37.1), నిజామాబాద్(36.6), మెదక్ (33.4), నల్గొండ(28.9), వరంగల్( 26.6), ఖమ్మం(26.5), రంగారెడ్డి(26.2), కరీంనగర్(24.3) ఉన్నాయి. అతి తక్కువగా హైదరాబాద్లో 15.7 శాతం నమోదైంది. స్టంటింగ్ రేటును ఏటా రెండు శాతం చొప్పున 2022 నాటికి 22 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 65.1 శాతంతో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది.
ఐదారు సార్లు తినబెట్టాలి
బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ఎదుగుతున్న క్రమంలో పౌష్టికాహారం అందించాలి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఐరన్, జింక్, కాల్షియం ఎక్కువుండే ఆహారాన్ని రోజుకు ఐదారు సార్లు ఇవ్వాలి. పిల్లలుండే ప్రదేశాల్లో శుభ్రత పాటించాలి. పిల్లలు అనారోగ్యం బారిన పడినపుడు చికిత్సకు ఆలస్యం చేస్తే ఎత్తు పెరుగుదలపై ప్రభావం ఉంటుందని డాక్టర్ లక్ష్మయ్య అన్నారు.