
- నేడు ఈజిప్ట్లో జరగనున్న సదస్సు
న్యూఢిల్లీ: యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దేల్ ఫతా నుంచి ఆదివారం ఆహ్వానం అందింది. సోమవారం ఈజిప్ట్లో జరిగే ఈ సమావేశానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్తోపాటు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. అయితే, మన దేశం తరఫున ప్రధాని మోదీ స్వయంగా హాజరు కారని, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కన్ఫామ్ చేసింది.
సమిట్లో యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్, యూకే, ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ పీఎం జార్జియా మెలోని, ఫ్రెంచ్ పెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తోపాటు 20కి పైగా దేశాల లీడర్లు పాల్గోనున్నారు. ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాల్గొంటారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించి, శాంతి..స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.
కాగా, హమాస్, ఇజ్రాయెల్ నడుమ చాలాకాలంలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ఇదివరకే శాంతి ఒప్పందం పేరిట 21 సూత్రాల ఫార్ములాను రూపొందించారు. దానిని మనదేశంతోపాటు, రష్య, చైనా తదితర దేశాలుకూడా సమర్థించాయి. పాలస్తీనియన్ టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ మాత్రం ఈ ఫార్ములాను వ్యతిరేకిస్తోంది.