
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. అయితే, సదస్సు నిర్వహణకు సంబంధించి ఖర్చు అనుకున్న దానికంటే పెరగడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జీ20 సమావేశాలకు ప్రభుత్వం కేటాయించిన దానికంటే 300% అధికంగా ఖర్చు చేసిందని రాజ్యసభ సభ్యుడు, తృణముల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే అన్నారు. కాగా, జీ20 జరిగే ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి ఖర్చుల వివరాలను లెక్కలతో సహా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ మొత్తం రూ.4,110.75 కోట్లుగా ఉంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం వివరణ ఇస్తూ రూ.4,110.75 కోట్లలో, రూ.3,600 కోట్లు(88%) ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) కింద ఖర్చు చేసినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది. ఈ ఖర్చులో సదస్సు నిర్వహించిన భారత్ మండపం నిర్మాణం వ్యయం కూడా ఉందని పేర్కొన్నారు.