
- 2026లో వైట్బాల్ సిరీస్ ఆడనున్న టీమిండియా
- విమెన్స్ జట్టుతో మూడు టీ20లు, ఒక టెస్ట్
మాంచెస్టర్: వచ్చే ఏడాది ఇంగ్లండ్లో టీమిండియా వైట్బాల్ టూర్ ఖరారైంది. ఇరుజట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు జరుగుతాయని ఈసీబీ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఈ వైట్ బాల్ సిరీస్ల కోసం మళ్లీ ఇంగ్లండ్ వెళ్లనుంది.
2026 జులై 1, 4, 7, 9, 11న వరుసగా డర్హమ్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్లో టీ20లు జరగనున్నాయి. జులై 14, 16, 19న వరుసగా మాంచెస్టర్, కార్డిఫ్, లార్డ్స్ వన్డే మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి. ఇక ఇండియా విమెన్స్ జట్టు మే 28 (చెమ్స్ఫోర్డ్), 30 (బ్రిస్టల్), జూన్ 2 (టాంటన్)న ఇంగ్లండ్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
ఇరుజట్ల మధ్య జులై 10 నుంచి 13 వరకు లార్డ్స్లో ఏకైక టెస్ట్ జరగనుంది. ఓవరాల్గా ఇంగ్లండ్ జట్టు తమ సమ్మర్ సీజన్ను ఫుల్ షెడ్యూల్తో నింపేసింది. న్యూజిలాండ్తో మూడు టెస్ట్లు (జూన్ 4 నుంచి 29 వరకు), లార్డ్స్, ఓవల్, నాటింగ్హామ్లో ఆడనుంది. దీని తర్వాత ఇండియాతో వైట్బాల్ సిరీస్ మొదలవుతుంది.
ఇది పూర్తి కాగానే పాకిస్తాన్తో మూడు టెస్టుల్లో (ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 13 వరకు) పాల్గొంటుంది. ఆ వెంటనే సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు జరుగుతాయి. ఇక ఇంగ్లిష్ విమెన్స్ టీమ్ కూడా బిజీగా గడపనుంది. మే 10 నుంచి 16 వరకు న్యూజిలాండ్తో మూడు వన్డేలు (డర్హమ్, నార్తాంప్టన్, కార్డిఫ్), మే 20 నుంచి 25 వరకు మూడు టీ20లు (డెర్బీ, కాంటర్బెరీ, హోవ్) జరుగుతాయి. తర్వాత ఇండియాతో మూడు టీ20లు, ఒక టెస్ట్ ఆడనుంది. ఆ వెంటనే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు లీస్టర్, డెర్బీ, వార్సెస్టర్లో ఐర్లాండ్తో మూడు వన్డేలు ఆడుతుంది.