2022లో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాన్ని న్యూయార్క్కు చెందిన ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్డాగ్ యాక్సెస్ నౌ అనే సంస్థ తెలిపింది. ఈ జాబితాలో భారత్ వరుసగా 5వ సారి అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. 35 దేశాల్లోని అధికారులు 187 ఇంటర్నెట్ షట్డౌన్లను ఏర్పాటు చేశారు. ఈ షట్డౌన్లలో 84 భారత్ లోనే జరిగాయి. ఈ 84 లో 49 సార్లు జమ్మూకాశ్మీర్లో జరిగాయని యాక్సెస్ నౌ తన నివేదికలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 2019లో భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదాని రద్దు చేసింది.
రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుండి ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతంపై క్రమం తప్పకుండా కమ్యూనికేషన్ పరిమితులను విధించింది. ఇక ఈ లిస్టులో రష్యా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత కనీసం 22 సార్లు రష్యా సైన్యం ఇంటర్నెట్ యాక్సెస్ను తగ్గించింది.