- జోరుమీదున్న ఇరుజట్లు
- రోహిత్ , ధవన్ ఆడతారా?
ముంబైలో ఓడాం.. రాజ్కోట్లో రేసులోకి వచ్చాం.. మరి చిన్నస్వామిలో..? తేలాలంటే నేడు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టీమిండియా పెర్ఫామెన్స్ను చూడాల్సిందే..! సమవుజ్జీల సమరంగా సాగుతున్న ఈ సిరీస్ ఆఖరి ఘట్టం కోసం అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ఆత్రుతగా ఎదురుచూ స్తున్నారు..! ఇక మిగిలింది… గ్రౌండ్లో ఎవరి బలమేంటో.. ఎవరి బలహీనతలు ఏంటో తేల్చుకోవడమే..! ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం ఈ మ్యాచ్లో ఇద్దరూ ఫేవరెట్లే..! సిరీస్ ఎవరిదో అంచనా వేయడం కష్టంగా మారిన తరుణంలో.. చిన్నస్వామిలో ‘పెద్దాట’ ఆడే హీరో ఎవరో? వేచి చూడాలి..!!
బెంగళూరు: గబ్బర్ గుబాళింపు.. రాహుల్ మేనియా.. కోహ్లీ కొట్టుడుతో.. రెండో వన్డేలో ఊగిపోయిన టీమిండియా అసలు పోరాటానికి సిద్ధమైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1–1తో సమంగా ఉంది. గతంలో జరిగిన అన్ని సిరీస్ల్లో పూర్తి ఏకపక్ష విజయాలతో ఆధిపత్యం చూపెట్టిన ఇండియాకు.. తొలిసారి కంగారూల నుంచి అతిపెద్ద సవాలు ఎదురైంది. అయినా ఒక్కో సవాల్ను తమదైన శైలిలో పరిష్కరించుకుంటూ వచ్చిన టీమిండియా.. కొన్ని అనుమానాలను కూడా నివృత్తి చేసుకుంది. ముఖ్యంగా శిఖర్ ఫామ్పై కొనసాగుతున్న ఆందోళనకు ఎట్టకేలకు తెరపడటం.. రాహుల్కు ఐదో ప్లేస్ కన్ఫామ్ కావడం, కీపర్గా ఆకట్టుకోవడం వంటి సానుకూలాంశాల మధ్య.. మరోసారి తమ లైనప్ను టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కాబట్టి అచ్చొచ్చిన చిన్నస్వామిలో మరోసారి కంగారూల దుమ్ముదులిపి సిరీస్ను ఎగరేసుకుపోవాలని టీమిండియా భారీ టార్గెట్గా పెట్టుకుంది. ఇక ఆసీస్ కూడా ఇండియా గడ్డపై వరుసగా రెండో సిరీస్ గెలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ధవన్, రోహిత్పై సందిగ్ధత..!
అత్యద్భుతమైన బ్యాటింగ్ కాంబినేషన్తో రాజ్కోట్లో దుమ్మురేపిన టీమిండియా.. బెంగళూరులోనూ సేమ్ సీన్ రిపీట్చేయాలని భావిస్తోంది. టాప్–3లో ధవన్, రోహిత్, కోహ్లీ చెలరేగితే.. ఐదో స్థానంలో వచ్చిన రాహుల్ స్లాగ్ ఓవర్లలో దంచికొట్టడం టీమ్లో కొత్త జోష్ను నింపింది. ఇన్నాళ్లూ స్పెషలిస్ట్ ఓపెనర్గా ఉన్న ఈ కర్నాటక కుర్రాడు.. ఫినిషర్ గానూ పనికొస్తానని నిరూపించుకున్నాడు. గాయంతో పంత్ లేకపోవడం, గ్లౌజ్ వర్క్లోనూ రాహుల్ ఆకట్టుకోవడంతో టీమ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంతో మూడో వన్డేలోనూ ఇదే ఆర్డర్ను కంటిన్యూ చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు. అయితే రెండో వన్డేలో గాయపడిన ధవన్, రోహిత్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంటారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ ఇద్దరూ కోలుకుంటున్నారని బీసీసీఐ ప్రకటించినా.. మ్యాచ్ ఫిట్నెస్పై సందేహాలు కొనసాగుతున్నాయి. దీనికితోడు కీలకమైన కివీస్ టూర్ నేపథ్యంలో పూర్తి ఫిట్నెస్ లేని ఈ ఇద్దరినీ ఆడించే సాహసం కోహ్లీ చేస్తాడా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. నాలుగో నంబర్లో శ్రేయస్ రాణించాల్సిందే. లేదంటే ప్రత్యామ్నాయాలు తప్పవు. పంత్ గాయంపై సరైన సమాచారం లేదు కాబట్టి ఫైనల్ ఎలెవన్లో అతనికి చాన్స్ లేనట్లే. దీంతో మనీష్కు మరో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. కానీ దీనిని అతను ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. బౌలింగ్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు. అదే జరిగితే బుమ్రా, షమీ, సైనీ ప్లేస్లు ఖాయం. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ పెంచాలంటే సైనీ ప్లేస్లో ఠాకూర్ రావొచ్చు. రిస్ట్ స్పిన్నర్లలో కుల్దీప్కు తోడుగా చహల్కు చాన్స్ దక్కొచ్చు. ఎందుకంటే చిన్నస్వామి చహల్ సొంత గ్రౌండ్. ఏదేమైనా భారీ టార్గెట్ నిర్దేశిస్తేనే ఈ మ్యాచ్లో విజయాన్ని ఆశించొచ్చు.
మార్పుల్లేవు..!
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఆసీస్ కూడా ఫైనల్ ఎలెవన్లో మార్పులు చేసేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే రెండో వన్డేలో భారీ టార్గెట్ ఛేజింగ్లోనూ స్మిత్ ఉన్నంతవరకు ఆసీస్ మెరుగైన స్థితిలోనే ఉన్నది. కాబట్టి అదే లైనప్ను కంటిన్యూ చేయాలని యోచిస్తున్నది. పిచ్ పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ఒకటి, రెండు మార్పులు జరిగితే జరగచ్చు. తొలి వన్డేలో దుమ్మురేపిన ఓపెనర్లు వార్నర్, ఫించ్ మరోసారి భారీ ఇన్నింగ్స్పై దృష్టిపెట్టారు. స్మిత్ ఫామ్లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. కెరీర్లో తొలి వన్డే మ్యాచ్లో ఆకట్టుకున్న లబుషేన్.. కీలక సమయంలో వికెట్ ఇచ్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. క్యారీ, టర్నర్ బ్యాట్లకు పని చెప్పాల్సిన సమయం వచ్చేసింది. లోయర్ ఆర్డర్లో అగర్ ఫర్వాలేదనిపించినా.. స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తోంది. బౌలింగ్లో స్టార్క్ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత మ్యాచ్లో 10 ఓవర్లలో 78 రన్స్ ఇవ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కమిన్స్ కూడా కీలక వికెట్లు తీయలేకపోతున్నాడు. స్పిన్లో జంపా సూపర్బ్. ప్రతిసారి కోహ్లీ వికెట్ తీస్తుండటం ఆసీస్కు అదనపు బలంగా మారింది. మరో స్పిన్నర్ అగర్ మ్యాజిక్ చూపడం లేదు. కీలకమైన మ్యాచ్ కాబట్టి అందరూ సమిష్టిగా చెలరేగితే టీమిండియాను నిలువరించొచ్చు. లేదంటే మరో రాజ్కోట్ తప్పకపోవచ్చు.