Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. సొంతగడ్డపై, భారీ అభిమాన సందోహం మధ్య కప్పు గెలిచేందుకు టీమిండియాకు మెరుగైన అవకాశాలే ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్ అయ్యాక ఇండియన్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సూర్యకుమార్ 35 ఏళ్ల వయసు పెరిగింది, ఫామ్ తగ్గింది. కెరీర్ డైలామాలో ఉంది. కాబట్టి రిటైర్మెంట్ కి ఇది సరైన సమయమే.. వరల్డ్ కప్ గెలిచి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది అతడి ఇష్టం.
కాగా సూర్య కుమార్ యాదవ్ ఇప్పటి వరకు టెస్టుల్లో ఒకే మ్యాచ్ ఆడాడు.. రెండేళ్లు వన్డే జట్టులో ఆడినా.. 2023 ప్రపంచకప్ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో అతడిపై వేటు పడింది. ఇక అప్పటి నుంచి టీ20లకి మాత్రమే అతడు పరిమితం అయ్యాడు. ఏడాదిన్నర కిందట వెస్టిండిస్ తో టీ20 ప్రపంచకప్ గెలిచాక.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఒకేసారి టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. రోహిత్ స్థానంలో టీ20 జట్టు పగ్గాలు అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్. అతడి సారథ్యంలో భారత జట్టు ఒక్కటంటే ఒక్క సిరీస్ కూడా ఇప్పటి వరకు ఓడిపోకపోవడం గమనార్హం. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న టీ20 పొట్టి ప్రపంచకప్ లోనూ ఫైనల్ కి చేరింది. రేపు కివీస్ తో ఫైనల్ ఆడబోతోంది. ఇందులో గెలిస్తే.. జట్టుకి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా దిగ్గజాల జాబితాలో చేరతాడు.. టీ20 క్రికెట్ నుంచి రిటైరవ్వడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి ఉండదు.
ఒకవేళ భారత జట్టు ఫైనల్లో ఓడితే.. సూర్యకుమార్ యాదవ్ కి మరో ఛాయిస్ లేదు. అతడిపై సెలక్టర్లు వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే.. తనే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కెప్టెన్ అయిన దగ్గర నుంచి అతడు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కెప్టెన్ కావడానికి ముందు సూర్య 68 మ్యాచ్లో 43.33 సగటుతో 2,340 రన్స్ చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కానీ కెప్టెన్ అయ్యాక 41 మ్యాచ్ లలో 26.62 సగటుతో 932 రన్స్ చేశాడు. ఒక్క సెంచరీ లేదు.. కెప్టెన్ కావడం వల్లే జట్టులో కొనసాగుతున్నాడు కానీ.. ఇలాంటి ప్రదర్శన చేసిన ప్లేయర్ పై వేటు పడేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూర్యకుమార్ ఆధ్వర్యంలో టీమిండియా వరుసగా సిరీస్ లు గెలిచిన.. అందులో అతడి పాత్ర పెద్దగా లేదని విమర్శలు వచ్చాయి. దీంతో సూర్య నిజంగానే ఫైనల్ అనంతరం రిటైర్మెంట్ ఇస్తాడా లేదా అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
