
- కుల్దీప్, సూర్య, అభి విజృంభణ.. సూపర్-4 రౌండ్కు సూర్యసేన
దుబాయ్: పవర్ఫుల్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్, ఖతర్నాక్ బ్యాటింగ్.. ఇలా అన్నింటా అదరగొట్టిన టీమిండియా ఆసియాకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసింది. బాయ్కాట్ డిమాండ్లు, నిరసనల మధ్య గతానికి భిన్నంగా పెద్దగా హైప్ లేకుండా సాగిన చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ వార్లో పాక్పై మళ్లీ టీమిండియాదే పైచేయి అయింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్–ఎ పోరులో సూర్యకుమార్ సేన 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18), జస్ప్రీత్ బుమ్రా (2/28) దెబ్బకు తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరు మాత్రమే చేసింది. సాహిబ్జదా ఫర్హాన్ (44 బాల్స్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40), షాహీన్ షా ఆఫ్రిది (16 బాల్స్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్) టాప్ స్కోరర్లు. పాండ్యా (1/34), వరుణ్ చక్రవర్తి (1/24) తలో వికెట్ తీశారు. అనంతరం బర్త్డే బాయ్ సూర్యకుమార్ యాదవ్ (37 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), తిలక్ వర్మ (31 బాల్స్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 31) మెరుపులతో ఇండియా 15.5 ఓవర్లోనే 131/3 స్కోరు చేసి గెలిచింది. సైమ్ ఆయుబ్ (3/35) మూడు వికెట్లు తీశాడు. వరుసగా రెండు విజయాలతో ఇండియా సూపర్–4 రౌండ్కు క్వాలిఫై అయింది. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. శుక్రవారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో ఒమన్తో ఇండియా తలపడనుంది.
బౌలర్ల పంజా
పాక్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇన్నింగ్స్లో ఏకంగా 63 డాట్ బాల్స్తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ ఫర్హాన్, పేసర్ షాహీన్ పోరాటంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఓపెనర్ సైమ్ ఆయుబ్ (0)ను హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ చేశాడు. పాండ్యా సింపుల్ లెంగ్త్ బాల్ను సైమ్.. స్క్వేర్ డ్రైవ్ చేయబోయి బుమ్రాకు ఈజీ క్యాచ్ ఇచ్చాడు. ఆపై బుమ్రా తన రెండో బాల్కే మహ్మద్ హారిస్ (3) పని పట్టాడు. దాంతో 6/2తో ఆరంభంలోనే పాక్ ఇక్కట్లు పడ్డది. బుమ్రా ఓవర్లోనే ఫఖర్ జమాన్ (17) ఎల్బీ అయినా రివ్యూలో బతికిపోయాడు. ఈ టైమ్లో ఫర్హాన్, ఫకర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. పాండ్యా తర్వాతి ఓవర్లో జమాన్ రెండు ఫోర్లు కొట్టగా.., బుమ్రా వరుస ఓవర్లలో ఫర్హాన్ రెండు సిక్సర్లతో స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. దాంతో పవర్ ప్లేను 42/2తో ముగించిన పాక్ కోలుకున్నట్టు కనిపించింది. అయితే ఫీల్డింగ్ మారిన తర్వాత ఇండియా స్పిన్నర్ల హవా మొదలైంది. కుల్దీప్, వరుణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. వరుస ఓవర్లలో జమాన్, కెప్టెన్ సల్మాన్ ఆగా (3)ను పెవిలియన్ చేర్చిన అక్షర్ పాక్ను 49/4తో నిలిపాడు. ఇండియా స్పిన్నర్ల ధాటికి 7–11 ఓవర్లలో 12 రన్స్ మాత్రమే వచ్చాయి.
ఓ దశలో 33 బాల్స్లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్న ఓపిగ్గా క్రీజులో నిలిచిన ఫర్హాన్.. అక్షర్ వేసిన 12వ ఓవర్లో సిక్స్తో ఇన్నింగ్స్లో చలనం తీసుకొచ్చాడు. కానీ, తన తర్వాతి ఓవర్లో కుల్దీప్ వరుస బాల్స్లో హసన్ నవాజ్ (5), మొహమ్మద్ నవాజ్ (0)ను పెవిలియన్ చేర్చడంతో పాక్ 64/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినా పోరాటం కొనసాగించిన ఫర్హాన్ను 17వ ఓవర్లో కుల్దీప్ ఔట్ చేయడంతో పాక్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, చివర్లో పేసర్ షాహీన్ ఆఫ్రిది అనూహ్యంగా ఎదురుదాడి చేశాడు. కుల్దీప్, వరుణ్ ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టి స్కోరు వంద దాటించాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సుఫియాన్ ముఖీమ్ (10) లాస్ట్ బౌల్కు బౌల్డ్ అవ్వగా.. హార్దిక్ వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన షాహీన్ స్కోరు 120 మార్కు దాటించాడు.
ధనాధన్ ఫటాఫట్
పాక్ బ్యాటర్లు వణికిన వికెట్పై ఇండియా అదరగొట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభంతో చిన్న టార్గెట్ను ఈజీగా ఛేజ్ చేసింది. పాక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షాహీన్పై అభి విరుచుకుపడ్డాడు. అతను వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బాల్స్కు 4, 6తో సూపర్ స్టార్టింగ్ ఇచ్చాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ సైమ్ ఆయుబ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన గిల్ తర్వాతి బాల్కు స్టంపౌట్ అయ్యాడు. అయినా తగ్గని అభి.. షాహీన్ తర్వాతి ఓవర్లో మరో ఫోర్, సెన్సేషన్ పికప్ షాట్ సిక్స్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆయుబ్ బౌలింగ్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను మరో షాట్కు ట్రై చేసి అష్రఫ్కు చిక్కాడు. అయినా ఇండియా జోరు తగ్గలేదు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ.. నవాజ్ బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టి పవర్ ప్లేను 61/2తో ముగించాడు. క్రీజులో కుదురుకునేందుకు కొంచెం టైమ్ తీసుకున్న కెప్టెన్ సూర్య ముఖీమ్ ఓవర్లో ఫోర్తో టచ్లోకి వచ్చాడు. అతని బౌలింగ్లోనే తిలక్ భారీ సిక్స్ కొట్టగా.. సూర్య మరో ఫోర్ రాబట్టాడు. 12వ ఓవర్లో తిలక్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను స్పిన్నర్ నవాజ్ డ్రాప్ చేశాడు. కానీ తర్వాతి ఓవర్లోనే సైమ్ అతడిని బౌల్డ్ చేశాడు. అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన సూర్య.. వెంటవెంటనే మూడు ఫోర్లతో జోరు పెంచగా, సైమ్ బౌలింగ్లో దూబే (10 నాటౌట్) భారీ సిక్స్ కొట్టాడు. ఆపై ముఖీమ్ బౌలింగ్లో సిక్స్తో సూర్య మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్: 20 ఓవర్లలో 127/9 (సాహిబ్జదా ఫర్హాన్40, షాహీన్ షా ఆఫ్రిది 33 నాటౌట్, కుల్దీప్ యాదవ్ 3/18, అక్షర్ పటేల్ 2/18).
ఇండియా: 15.5 ఓవర్లలో131/3 ( సూర్య 47 నాటౌట్, తిలక్ 31, అభి 31, సైమ్ ఆయుబ్ 3/35)
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఈ పోరు గతానికి భిన్నంగా సాగింది. టాస్ టైమ్లో ఇరు జట్ల కెప్టెన్ సూర్యకుమార్, సల్మాన్ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరుజట్ల ప్లేయర్లు, స్టాఫ్ మెంబర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. ఈ మ్యాచ్కు బీసీసీఐ అధికారులు ఎవ్వరూ రాలేదు. ఫ్యాన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో స్టేడియం పూర్తిగా నిండలేదు. పలు స్టాండ్స్ ఖాళీగా కనిపించాయి.