
యుపియా (అరుణాచల్ ప్రదేశ్): సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్–19 చాంపియన్షిప్ను ఇండియా కుర్రాళ్లు రెండోసారి సొంతం చేసుకున్నారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఇండియా పెనాల్టీ షూటౌట్లో 4–-3తో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 1–-1తో సమమైంది.
ఇండియా కెప్టెన్ షమీ రెండో నిమిషంలోనే గోల్ రాబట్టగా.. బంగ్లా ప్లేయర్ జాయ్ అహమ్మద్ 61వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. థ్రిల్లింగ్ పెనాల్టీ షూటౌట్లో ఇండియా సూరజ్ సింగ్ బంగ్లా ఆటగాడు సలాహుద్దీన్ సాహెద్ షాట్ను ఎడమవైపు డైవ్ చేసి అడ్డుకోగా.. కెప్టెన్ షమీ ఫైనల్ కిక్లో బాల్ను నెట్లోకి పంపి జట్టును గెలిపించాడు.