న్యూఢిల్లీ: టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ప్రేక్షకుల ప్రవర్తనతో తాను ఇబ్బంది పడ్డానని ఇండియా టీనేజ్ చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ తెలిపింది. టోర్నీకి వచ్చిన ప్రేక్షకులు తన ఆటను కాకుండా వ్యక్తిగతమైన, అనవసర విషయాలపైనే దృష్టిసారించారని వెల్లడించింది. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీ సందర్భంగా ఎదురైన ఈ చేదు అనుభవం గుచించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళా ప్లేయర్లు తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 18 ఏండ్ల దివ్య తెలిపింది.
‘ఈ టోర్నీలో కొన్ని మంచి గేమ్లు ఆడాను. దాని పట్ల సంతృప్తిగా ఉన్నా. కానీ, ప్రేక్షకులు నా ఆట గురించి తప్ప నా జుట్టు, వేసుకున్న బట్టలు, నేను మాట్లాడే యాస వంటి అనవసర విషయాల గురించే మాట్లాడుతున్నారని తెలిసి చాలా బాధ పడ్డా. అబ్బాయిలు తమ ఆటతోనే స్పాట్లైట్లో నిలుస్తుంటే అమ్మాయిలను మాత్రం చెస్ బోర్డులో వారి టాలెంట్కు సంబంధం లేని విషయాల ఆధారంగా జడ్జ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎంత బాగా ఆడుతున్నా అమ్మాయిలకు సహజంగానే తక్కువ పేరు వస్తోంది.
అదే సమయంలో తరచూ ద్వేషాన్ని భరిస్తూ ఉంటున్నారు. నాకు 18 ఏండ్లు మాత్రమే. అయినా చాలా ద్వేషాన్ని ఎదుర్కొన్నా. ఆటేతర విషయాలతోనే నన్ను జడ్జ్ చేస్తున్నారు. ఈ ఆటలో ఇప్పటికైనా అమ్మాయిలకు కూడా సమాన గౌరవం లభించాలని ఆశిస్తున్నా’ అని అభిప్రాయపడింది.