ముంబై: అమెరికా–చైనా మధ్య టెన్షన్స్ పెరుగుతుండడంతో సోమవారం సెషన్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2,002.27 పాయింట్లు నష్టపోయి 31,715.35 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 566.40 పాయింట్లు పతనమై 9,293.50 పాయింట్ల వద్ద ముగిసింది. రూ. 5.15 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ ప్యాక్లో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి షేర్లు అధికంగా నష్టపోయాయి. క్యూ4 రిజల్ట్స్ మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోకపోవడంతో రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, టెక్ మహింద్రా షేర్లు కూడా పతనమయ్యాయి. సెన్సెక్స్లో భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా స్టాకులు మాత్రమే పాజిటివ్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు కూడా నెగిటివ్లో సెషన్ను ప్రారంభించాయని ఆనంద్ రాఠీ ఈక్విటీ రిసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి అన్నారు. జపాన్, చైనా మార్కెట్లకు సెలవు. హాంగ్ కాంగ్, సియోల్ మార్కెట్లు 4 శాతం నష్టపోగా, యురోపియన్ మార్కెట్లు నెగిటివ్లో ప్రారంభమయ్యాయి. సోమవారం సెషన్లో డాలర్ మారకంలో ఇండియన్ రూపాయి 64 పైసలు క్షీణించి 75.73 వద్ద క్లోజయ్యింది. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 2.95 శాతం తగ్గి బ్యారెల్కు 25.66 డాలర్ల స్థాయికి చేరుకుంది.