టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యుత్తమ పురస్కారం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు ఆయనను వరించింది. ఇవాళ గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. సినీ పరిశ్రమకు చిరు అందించిన విశేష సేవలకు గానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా, ఇప్పటి వరకూ ఈ అవార్డును అమితాబ్, సలీమ్ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి, వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ’ అవార్డు ప్రదానం చేస్తున్నారు. అయితే ఈ పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, 10లక్షల రూపాయలతో పాటు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఇక చిరు హీరోగా 150కిపైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఆయన ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ మూవీస్ లో నటిస్తున్నారు.