న్యూఢిల్లీ: రైల్వేలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ ఏడాది 52 వారాల్లో 52 సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. రెండు కొత్త సంస్కరణలను ఇదివరకే ఆమోదించామని, త్వరలోనే వాటిని అమల్లోకి తెస్తామని చెప్పారు. రిఫార్మ్స్ తాత్కాలికం కావని, అదొక నిరంతర ప్రక్రియ అన్నారు. కార్గో క్యారియర్ లో ప్రపంచంలోనే భారతీయ రైల్వే రెండో అతిపెద్దదిగా నిలిచిందన్నారు.
వ్యవస్థలో కొత్త తరం ట్రెన్లను అందుబాటులోకి తెచ్చామని, పని సంస్కృతిలో కొత్త పద్ధతులను అవలంబిస్తున్నామని వెల్లడించారు. సుదూర ప్రయాణాలు చేసే రైళ్లలో ఎండ్ టు ఎండ్ పరిశుభ్రతను పాటిస్తామన్నారు. గతంలో రిజర్వ్ డ్ కోచ్ లలోనే క్లీనింగ్ జరిగేదని, మొదటిసారిగా జనరల్ కోచ్ లలోనూ క్లీనింగ్ ప్రక్రియ చేపట్టామని వివరించారు.
