ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా అమ్మాయిలు సంచలన పెర్ఫామెన్స్ చేశారు. ఒకే రోజు మూడు గోల్డ్ మెడల్స్ నెగ్గి ఔరా అనిపించారు. ప్రతిష్టాత్మక టోర్నీ మహిళల కేటగిరీలో ఇప్పటిదాకా ఇండియాకు ఒకే ఒక్క స్వర్ణం దక్కగా.. స్వదేశంలో ఉడుం పట్టుతో విజృంభించిన దివ్య కక్రాన్, పింకి, సరితా మోర్ ట్రిపుల్ ధమాకా మోగించారు. నిర్మలా దేవి సిల్వర్ మెడల్తో మెప్పించడంతో టోర్నీలో ఇండియా మెడల్స్ సంఖ్య తొమ్మిదికి చేరింది.
న్యూఢిల్లీ: ఇండియా మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మూడో రోజు మూడు స్వర్ణాలు సహా నాలుగు మెడల్స్తో మెప్పించారు. వరల్డ్ జూనియర్ చాంపియన్తో పోరు సహా నాలుగు బౌట్లలో విజయం సాధించిన దివ్య కక్రన్ (68 కేజీ), సరితా మోర్ (59 కేజీ), పింకి (55 కేజీ) స్వర్ణాలు సాధించారు. ఫైనల్లో ఓడిన నిర్మలా దేవి (50 కేజీ) సిల్వర్తో సరిపెట్టింది. 2018లో జరిగిన టోర్నీలో నవ్జోత్ కౌర్ 65 కేజీల కేటగిరీలో గోల్డ్ నెగ్గి ఆసియాలో స్వర్ణం గెలిచిన ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించగా.. గురువారం దివ్య, సరితా, పింకి ఆమె సరసన చేరారు. చైనా రెజ్లర్లు లేకపోవడం, జపాన్ నుంచి బెస్ట్ ప్లేయర్లు బరిలోకి దిగకపోవడం ఇండియాకు కలిసొచ్చింది. గతేడాది కాంస్యం, 2017లో సిల్వర్ గెలిచిన కక్రాన్ ఈ సారి పసిడి నెగ్గేదాకా పట్టు వదల్లేదు. 68 కేజీల కేటగిరీలో ఐదుగురు రెజ్లర్లే బరిలో నిలవడంతో రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు రౌండ్లలో గెలిచిన కక్రాన్ గోల్డ్ కైవసం చేసుకుంది. తొలి రెండు బౌట్లలో అల్బినా (కజకిస్థాన్), డెల్గెర్మా (మంగోలియా)ను ఓడించిన దివ్య మూడో రౌండ్లో 8–0తో అజొడా (ఉజ్బెకిస్థాన్)ను 27 సెకండ్లలోనే మట్టికరిపించింది. చివరి రౌండ్లో జపాన్కు చెందిన జూనియర్ వరల్డ్ చాంపియన్ నరుహ మత్సుయుకితో ఇండియా రెజ్లర్కు సవాల్ ఎదురైంది. ఈ బౌట్లో లెగ్ అటాక్స్తో విజృంభించిన దివ్య ఆరంభంలోనే ఓ టేక్ డౌన్, మరో ఎక్స్పోజ్ మూవ్తో 4–0తో లీడ్ సాధించింది. కానీ, సెకండ్ రౌండ్లో గొప్పగా పుంజుకున్న నరుహ.. దివ్య రైట్ లెగ్ను పట్టేసి 4–4తో స్కోరు సమం చేసింది. జపాన్ రెజ్లర్ దాదాపు విజయం ఖాయం చేసుకుంటున్న టైమ్లో కఠినమైన పొజిషన్ నుంచి తప్పించుకున్న దివ్య ఆ వెంటనే ప్రత్యర్థిని కింద పడేసి బై ఫాల్తో మెడల్ గెలిచింది. 2017లో సిల్వర్ నెగ్గిన తర్వాత తొలిసారి ఈ టోర్నీలో బరిలో నిలిచిన సరిత 59 కేజీల గోల్డ్ మెడల్ బౌట్లో 3–2తో మంగోలియా రెజ్లర్ బాట్సెటెగ్పై ఉత్కంఠ విజయం సాధించింది. ఇక, సీనియర్ ఏషియన్లో ఫస్ట్ టైమ్ ఆడిన పింకి 55 కేజీల తుదిపోరులో 2–1తో డుల్గున్ బొలొర్మాను ఓడించి గోల్డ్ నెగ్గింది. అయితే, 50కేజీల గోల్డ్ మెడల్ బౌట్లో నిర్మలా దేవి 2–3తో జపాన్కు చెందిన మిహో యిగరషి చేతిలో పోరాడి ఓడి సిల్వర్తో వెనుదిరిగింది.