
టెస్టు ఫార్మాట్కు రోహిత్ రిటైర్మెంట్
హిట్మ్యాన్ అనూహ్య నిర్ణయం
వన్డేల్లో కొనసాగుతానని ప్రకటన
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న హిట్మ్యాన్ వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. బుధవారం రాత్రి ఇన్స్టా స్టోరీ ద్వారా ఈ విషయం వెల్లడించాడు. ‘అందరికీ హలో. నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయం మీతో పంచుకుంటున్నా. వైట్ జెర్సీలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఇన్నేండ్లపాటు మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు థ్యాంక్స్. వన్డే ఫార్మాట్లో ఇండియాకు ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నాడు. 280 నంబర్తో కూడిన తన టెస్టు క్యాప్ ఫొటోపై ఈ సందేశం ఇచ్చాడు. తన కెరీర్లో 67 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 ఫిఫ్టీలు ఉన్నాయి. 2013లో ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై టెస్టు అరంగేట్రం చేసిన అతను గతేడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో గత వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఇండియాను నడిపించిన రోహిత్ 24 టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో ఇండియా 12 మ్యాచ్ల్లో నెగ్గి తొమ్మిదింట్లో ఓడింది. మూడు డ్రాగా ముగిశాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత షార్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్.. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్లోనే ఇండియాకు ఆడనున్నాడు.
2027 వన్డే వరల్డ్ కప్ కోసమేనా..
రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని డిసైడయ్యాడని, అప్పటిదాకా ఫిట్గా ఉండేందుకే టెస్టులకు వీడ్కోలు ప్రకటించాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 38 ఏండ్ల వయసులో ఉన్న హిట్మ్యాన్ 2027 నాటికి 40 ఏండ్లు దాటుతాడు. అయినప్పటికీ ఫిట్నెస్పై దృష్టి పెట్టి వన్డేల్లో తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ‘చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వాలని రోహిత్ ఆలోచిస్తున్నాడు. కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం మవుతున్నందున దానికి ఇదే సరైన సమయమని భావించాడు’ అని చెప్పారు. మరోవైపు ముంబైలో అనధికారికంగా సమావేశమైన సెలక్షన్ కమిటీ వచ్చే వారం ఇంగ్లండ్ టూర్కు ప్రకటించే టీమ్లో రోహిత్కు ప్లేస్ ఉంటుందా? లేదా? అనే దానిపై అతనికి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. తన కెరీర్పై తుది నిర్ణయం అతనికే వదిలేసినట్టు సమాచారం. జట్టు నుంచి తప్పిస్తారానే హిట్మ్యాన్ రిటైర్మెంట్ ఇచ్చాడన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అయితే, రోహిత్ చాన్నాళ్ల కిందటే రిటైర్ అవుతానని నిర్ణయించుకున్నప్పుడు, అతన్ని జట్టు నుంచి తొలగించడం అనే ప్రశ్న ఎక్కడ నుంచి వస్తుందని రోహిత్ను సన్నిహితంగా గమనించిన బోర్డు మాజీ అధికారి ఒకరు ప్రశ్నించాడు.
థ్యాంక్యూ కెప్టెన్. వైట్ జెర్సీలో ఒక యుగం ముగిసింది! రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తను వన్డేల్లో దేశానికి నాయకత్వం వహిస్తూనే ఉంటాడు. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం హిట్మ్యాన్.
- ఎక్స్లో బీసీసీఐ
టెస్టుల్లో హిట్టు కొట్టలేదు
రోహిత్ టెస్టు కెరీర్ ఆరంభం నుంచే సవాళ్లతో సాగింది. వైట్ బాల్ ఫార్మాట్ మాదిరిగా వైట్ జెర్సీలో తన మార్కు చూపెట్టలేకపోయాడు. వన్డే, టీ20ల్లో కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్మురేసిన రోహిత్ రెడ్ బాల్ ఫార్మాట్లో ఆ స్థాయి చూపలేపపోయాడు. నాయకుడిగా వన్డే వరల్డ్ కప్లో ఇండియాను ఫైనల్ చేర్చిన అతను జట్టుకు టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ (వన్డే) అందించి ధోనీ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు. కానీ, 67 టెస్టుల కెరీర్లో హిట్మ్యాన్ సెనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అతను ఒకే ఒక్క సెంచరీ చేశాడు. గత ఏడాది కాలంగా అతను ఈ ఫార్మాట్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. చివరి19 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒక్కటే సెంచరీ చేయగలిగాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్లో స్వయంగా తుది జట్టు నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు రోహిత్ టెస్ట్ కెరీర్పై ప్రభావం చూపాయి.
కొత్త కెప్టెన్ ఎవరు.?
రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇండియాకు కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. జూన్ 20న మొదలయ్యే ఈ టూర్ కోసం సెలెక్టర్లు వారంలో టీమ్ను ప్రకటించనుండగా.. కెప్టెన్సీ రేసులో బుమ్రా, రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. ప్రస్తుత వైస్ కెప్టెన్ బుమ్రాకు ఇప్పటికే కొన్ని మ్యాచ్ల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది. కానీ, ఫాస్ట్ బౌలర్ కావడం, తరచూ గాయాలు అవుతున్నందున బుమ్రాను ఫుల్టైమ్ కెప్టెన్ చేసే విషయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు వెనకడుగు వేస్తున్నారు. బ్యాటర్గా పంత్లో నిలకడ లేకపోవడం ప్రతికూలం కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్, గిల్లో ఒకరికి పగ్గాలు అప్పగించే చాన్స్ కనిపిస్తోంది.