- యుద్ధానికి ముందే పెరిగిన ద్రవ్యోల్బణం..
- ఫిబ్రవరిలో 3.21 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా దాడులు చేయక ముందే ఇండియాలో సరుకుల ధరలు పెరగడం మొదలైంది. ధరల పెరుగుదలను కొలిచే రిటైల్ ద్రవ్యోల్బణం (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్–సీపీఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.21 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 2.74 శాతంగా ఉండగా, కొత్త బేస్ ఇయర్ 2024 ఆధారంగా లెక్కించిన రెండో రీడింగ్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.37 శాతంగా, పట్టణాల్లో 3.02శాతంగా నమోదైంది.
ఆహార ధరల వేగంగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఆహార పదార్ధల ధరలు ఎంతమేర పెరిగాయో తెలిపే ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 2.13శాతంగా ఉండగా, ఫిబ్రవరిలో 3.47 శాతానికి చేరింది. కొన్ని వంట సామాను ధరలు మాత్రం 2024 ధరలతో పోలిస్తే ఇంకా తక్కువగా ఉన్నాయి. అంటే డిఫ్లేషన్లో ఉన్నాయి. వెల్లుల్లి ధరలు -31శాతం తగ్గగా, ఉల్లిపాయలు -28శాతం తగ్గాయి.
బంగాళాదుంపలు కూడా -18శాతం తగ్గాయి. మరోవైపు, వెండి ఆభరణాల ధరలు 160శాతం పెరిగాయి. బంగారం, వజ్రం, ప్లాటినం ధరలు 48 శాతం పెరిగాయి. హౌసింగ్, దుస్తులు, ఆరోగ్య సేవలు, రెస్టారెంట్ ఖర్చులు వంటి విభాగాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హార్మూజ్ సముద్ర మార్గంలో షిప్పింగ్ సమస్యలతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.
దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రీషియస్ మెటల్స్, ఆహార ధరలు పెరగడంతో ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాలను కొద్దిగా పెంచింది. 2025–26లో సీపీఐ 2.1 శాతంగా, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్ (క్యూ4)లో 3.2శాతంగా ఉంటుందని తెలిపింది.
