న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల 4.82 శాతానికి పెరిగింది. జులైలో ఇది 4.45 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యంతో పోలిస్తే ఇది వరుసగా మూడోసారి కూడా ఎక్కువే.
వచ్చే నెల జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు బలపడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మనదేశం తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతానికి చేరుకోగా, రవాణా ద్రవ్యోల్బణం 4.60 శాతంగా నమోదైంది. అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లి ధరలు గణనీయంగా పెరిగాయి.
