ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు.. లోటు బడ్జెట్ ఉన్నా హామీలపై వెనక్కి తగ్గం: మంత్రి పొంగులేటి

ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు.. లోటు బడ్జెట్ ఉన్నా హామీలపై వెనక్కి తగ్గం: మంత్రి పొంగులేటి
  • విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నం
  • ఇల్లు రాలేదని మహిళలెవరూ బాధ పడొద్దు 
  • ములుగు జిల్లా ఇంచర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ

ములుగు/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: లోటు బడ్జెట్ ఉన్నా.. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఏ ఆడబిడ్డా తనకు ఇల్లు రాలేదని బాధపడొద్దన్నారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. 23 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్​ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ​పాల్గొన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని మండిపడ్డారు. 93వేల ఇండ్లకు టెండర్లు పిలిచి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. తాము ఏడాదిలోనే నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ములుగు నియోజకవర్గానికి ఐటీడీఏతో కలిపి 5వేల ఇండ్లు మంజూరయ్యాయని, మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇండ్ల నిర్మాణాలను బట్టి ప్రతీ సోమవారం లబ్ధిదారులకు చెక్కులు ఇస్తామన్నారు. వచ్చే లోకల్​బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు అండగా ఉండాలని కోరారు.  

ఓర్వలేక విపక్షాల విమర్శలు: సీతక్క 
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే చూసిఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడంతోపాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించామని, రూ.70 కోట్లతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా రూ.30 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.  ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. 

భూభారతి చట్టం ద్వారా ప్రతీ రైతుకు న్యాయం 
భూభారతి చట్టం ద్వారా ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. బుధవారం గోవిందరావుపేట రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ధరణి చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, ధరణివల్ల పేద రైతులు నష్టపోతే పెద్ద రైతులకు న్యాయం జరిగిందన్నారు. భూభారతి చట్టంలో ప్రతీ సమస్య పరిష్కరించడానికి వీలు కల్పించామన్నారు. ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, తప్పు చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజాధనాన్ని కొల్లగొడితే ఎంతటి వారినైనా శిక్షిస్తం
ప్రజాధనాన్ని కొల్లగొడితే ఎంతటి వారినైనా శిక్షిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియా తో చిట్ చాట్ చేశారు. "కాళేశ్వరం ప్రాజెక్టు రూప శిల్పిగా, తెలంగాణ జాతిపితగా చెప్పుకునే వ్యక్తిని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది. ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదు. ఉద్దేశపూర్వకంగా కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు" అని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ధనిక రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నిందని ఆరోపించారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామంటూ ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. కట్టిన ఏడాదిన్నరలోనే ప్రాజెక్టు కూలిపోతే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా విచారణ చేపడుతున్నట్టుగా వివరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఉద్దేశంతో నాణ్యతాలోపాలతో ప్రాజెక్టు కట్టారని, ఇందులో నిజ నిజాలు తేల్చేందుకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేశామన్నారు.