మార్చి11న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం

మార్చి11న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం
  • అవసరమైన ఏర్పాట్లు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • ఫస్ట్​ ఫేజ్​లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
  • తర్వాత దశలవారీగా పథకం అమలు
  • జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు
  • ఇంటి స్థలం లేనివాళ్లకు స్థలంతోపాటు రూ.5 లక్షలు
  • ప్రజాపాలనలో అప్లయ్​ చేసుకున్నోళ్లకు ప్రయారిటీ
  • ఇండ్లను తమకు తగ్గట్టుగా కట్టుకున్నా 
  • అందులో వంటగది, టాయిలెట్ ఉండాల్సిందే
  • నిధులు దుర్వినియోగం కాకుండా 
  • పకడ్బందీ గైడ్​లైన్స్​ ఉండాలని స్పష్టీకరణ

హైదరాబాద్​, వెలుగు:  ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో గ్యారంటీని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని  సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ స్కీమ్​ను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై శనివారం సెక్రటేరియెట్​లో  సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సీఎస్​ శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ వర్తింపజేయాలని అధికారులకు సీఎం సూచించారు. విధి విధానాలు రూపొందించి.. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. 

ఇంటి డిజైన్లు రెడీ చేయించండి.

గత ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అర్హులకు ఇండ్ల స్కీమ్​లో లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా పేదల సొంతింటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా.. ఇంటి స్థలం ఉన్న వాళ్లకు అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇండ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే  నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. సొంత జాగలో ఇల్లు కట్టుకునే వాళ్లకు వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సూచించారు. లబ్ధిదారులు సొంత ఇండ్లు తమకు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టినప్పటికీ అందులో తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని స్పష్టం చేశారు. 

ప్రజా పాలనలో 82.82 లక్షల అప్లికేషన్లు

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 82.82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. సొంత జాగ ఉండి, అందులో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం కావాలని కొందరు అప్లై చేసుకోగా.. మరికొంత మంది ఇంటి జాగతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలని అప్లై చేసుకున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలోనే ఎక్కువ దరఖాస్తులు (11.22 లక్షలు) వచ్చాయి. మొదటి విడతలో ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను మంజూరు చేస్తే 4 లక్షల 16 వేల 500 మందికి ఆర్థిక సాయం అందుతుంది. ప్రజఈాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, నిజంగా ఇండ్లు లేని నిరుపేదల కోసం గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా ఫైనల్​ చేయనున్నట్లు తెలిసింది. గతంలో మాదిరి ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాధ్యత కాకుండా పూర్తిగా అధికారులకు పవర్స్​ ఇచ్చి.. ఎమ్మెల్యేలు, మంత్రులకు మానిటరింగ్​ పనిని అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది.