మున్సిపల్ శాఖలో  అడ్డగోలు దోపిడీ

మున్సిపల్ శాఖలో  అడ్డగోలు దోపిడీ
  • గత 4 ఏండ్లలో ఇదీ కథ
  • 35 వేల కోట్ల పనులు, 5 వేల కోట్ల కమీషన్లు
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు 
  • అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్లకే కాంట్రాక్టులు
  • ఆ కాంట్రాక్టర్లూ పేరుకే.. పనులు చేసింది అనుచరులే 
  • నాసిరకం పనులు, చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు.. పట్టణప్రగతి నిధుల్లోనూ గోల్ మాల్
  • లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లలోనూ వేల కోట్లలో అవకతవకలు 
  • పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్ 

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​(ఎంఏయూడీ)లోనూ భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వాహనాల కొనుగోళ్లు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్​పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలిచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేపట్టడంతో పాటు చేసిన పనులు మళ్లీ చేసి రూ.కోట్లలో దండుకున్నట్టు గుర్తించారు. 

హెచ్ఎండీఏలోనూ వివిధ రకాల పర్మిషన్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు, ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు సర్కార్ ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలింది. రూ.వేల కోట్ల నిధుల గోల్​మాల్​జరిగిందని గుర్తించిన ప్రభుత్వం.. దీనిపైనా త్వరలోనే  పూర్తిస్థాయి విచారణ చేయించాలని భావిస్తున్నది. పట్టణ ప్రగతి నిధుల్లోనూ దుర్వినియోగం జరిగినట్టు తెలిసింది. బిడ్డింగ్, టెండర్లు లేకుండా ఎక్కడెక్కడ? ఎవరెవరికి ఎలాంటి పనులు ఇచ్చారు ? దాని వెనక ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై రిపోర్ట్​ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎంఏయూడీ పరిధిలో గత నాలుగేండ్లలో దాదాపు రూ.35 వేల కోట్ల మేర పనులు జరిగాయి. ఇందులో కమీషన్ల కిందనే దాదాపు రూ.5 వేల కోట్లు చేతులు మారినట్టు తెలిసింది. మాదాపూర్​లోని ఓ ప్రాంతంలో ఆఫీస్​ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ వ్యవహారాలు నడిపించినట్లు సమాచారం.  

ఎంక్వైరీ మొదలు పెట్టిన ప్రభుత్వం

అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 305 రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులు పూర్తిగా నాసిరకంగా చేశారని.. ఒక్కో పనిని మూడు నాలుగేండ్ల వ్యవధిలో మూడు నాలుగుసార్లు చేసినట్టు గుర్తించారు. కొన్ని చెయ్యని పనులూ చేసినట్టు చూపించి అక్రమంగా బిల్లులు పొందినట్టు తేలింది. సాధారణ నిధులతో పాటు పలు పథకాల ద్వారా వచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, డ్రైనేజీలు, ఎలివేటెడ్​కారిడార్లు, స్కైవాక్​లు, అండర్​పాస్​లు తదితర నిర్మాణ పనులన్నీ అధికార పార్టీ నాయకులతో ముందుగానే చేయించి.. ఆ తర్వాత ఎప్పుడో ఈ–ప్రొక్యూర్‌‌‌‌మెంట్ టెండర్లు పిలిచి, కావాల్సినోళ్లు మాత్రమే పాల్గొనేలా చేసి, బిడ్లు కూడా వారికే దక్కేలా చేశారు. ఇలా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇంటర్నల్​రోడ్లు, నాలా పనులు, కరెంట్​పోల్స్,  లైటింగ్, బ్యూటిఫికేషన్​ వంటివన్నీ షాడో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలోనే జరిగాయి. వీటికి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? పనులు ఎవరెవరు చేశారు? ఎంత మొత్తం నిధులు చెల్లించారు? ఏ రకంగా చెల్లింపులు జరిగాయనే కోణంలో ఇప్పటికే ఎంక్వైరీని ప్రభుత్వం మొదలుపెట్టింది. 

గత ప్రభుత్వ పెద్దలకు సహకరించిన అధికారులు.. 

కాంట్రాక్టు పనులతో పాటు వివిధ రకాల అనుమతులకు సంబంధించి అటు జీహెచ్ఎంసీ ఇటు హెచ్ఎండీఏ పరిధిలో భారీ అవినీతి జరిగినట్టు ఇంటెలిజెన్స్​రిపోర్టుల్లో తేలింది. రెవెన్యూ తర్వాత అత్యధికంగా మున్సిపల్​శాఖలోనే లంచాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ పెద్దలు ప్రైమ్​ఏరియాల్లో అక్రమంగా అనుమతులు పొందినట్టు.. లేఅవుట్, బిల్డింగ్​పర్మిషన్లు, ల్యాండ్​యూసేజ్, ఎన్ఓసీ, ఆక్యుపెన్సీ వంటివి తీసుకుని ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్​కాంప్లెక్స్​లు కూడా నిర్మించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అసలు వాటికి ఎలా అనుమతులు లభించాయి? ఎవరు ఇచ్చారనే దానిపై పూర్తిస్థాయి వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి జీవో 58, 59 కింద బినామీలకు రెగ్యులరైజ్​ చేయించి.. ఆ తర్వాత వాటిని డెవలప్​మెంట్​చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఆస్తుల విలువ రూ.వేల కోట్లు ఉంటుంది. ఇలా అక్రమంగా అనుమతులు ఇస్తూ, గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేసిన కొందరు అధికారులు సైతం లంచాలు, కమీషన్లు తీసుకుని రూ.వందల కోట్లు కూడబెట్టుకున్నట్టు విజిలెన్స్, ఏసీబీకి రిపోర్టులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై దాడులు చేసింది. దీంతో ఇతర అధికారుల్లోనూ భయం మొదలైంది.

ఓఆర్ఆర్ టెండర్లపైనా ఫోకస్.. ​

ఓఆర్ఆర్ టెండర్లలోనూ అవకతవకలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. దానిపైనా ఫోకస్ పెట్టింది. ఓఆర్ఆర్ టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్లకు ముంబై కంపెనీ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. 30 ఏండ్లకు కలిపి కేవలం రూ.7,380 కోట్లకే అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనిపై గతంలోనే రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్​నుకేసీఆర్​కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుందని అన్నారు. ఆయన సీఎం అయ్యాక ఈ ఓఆర్ఆర్​టెండర్​పై ఫోకస్​పెట్టారు. అసలు అగ్రిమెంట్​ ఎలా జరిగింది? దీని ద్వారా ఎవరెవరికి లబ్ధి జరిగింది? దాన్ని రద్దు చేయొచ్చా? అనే దానిపై రిపోర్ట్​తెప్పించుకుని లీగల్ గా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్​రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. 

షాడో కాంట్రాక్టర్లు.. 

రాష్ట్రంలో 13 మున్సిపల్​ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్నోళ్లకే కాంట్రాక్టు పనులు దక్కేవి. అదేదో పైస్థాయి ఆఫీసర్​ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగం నడిపించినట్టు తెలిసింది. వాళ్లు ఫోన్​ చేసి ఎవరి పేరు చెబితే కాంట్రాక్టు వాళ్లకే దక్కేది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీనేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని, పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, నాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.