న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికే వంట నూనెల రేట్లు మండిపోతుండగా.. అవి మరింత పెరిగే అవకాశముంది. పామాయిల్ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే ఇండోనేషియా.. దాని ఎగుమతులపై ఈ నెల 28 నుంచి నిషేధం విధించాలని నిర్ణయించింది. ధరలను తగ్గించడానికి వంట నూనెలతో పాటు ముడి సరుకుల షిప్మెంట్లను కూడా నిలిపేస్తామని ప్రెసిడెంట్ జోకో విడోడో ప్రకటించారు.
తమ దేశంలో ఆహార పదార్థాలు, వంట నూనెలకు కొరత లేకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘ఇండోనేషియా నుంచి మన దేశం ఎక్కువగా పామాయిల్ కొంటోంది. ఆ దేశం పామాయిల్ ఎగుమతులను బ్యాన్ చేయడం వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ నూనెల ధరలు పెరుగుతాయి. ఇండోనేసియా ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం” అని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది అన్నారు.
50 శాతం వాటా ఇండోనేషియాదే..
ఇండోనేషియాతో పాటు మలేషియాలోనూ పామాయిల్ ఉత్పత్తితగ్గింది. డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి పామాయిల్ ధరలు బాగా పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారీగా ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ నుంచి కూడా సప్లై ఆగిపోవడంతో ఆ నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇక నుంచి వంట నూనెల ధరల పెరుగుదలకు ఆకాశమే హద్దు అని ముంబైకి చెందిన ఒక డీలర్అన్నారు. పామాయిల్ఎగుమతుల్లో 50 శాతం వాటా ఇండోనేషియాదే! ఉక్రెయిన్ యుద్ధంతో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోవడంతో పామాయిల్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.