- గ్రామాల్లోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధే లక్ష్యం: సీఎం
- వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజ్
- ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు..
- గత ప్రభుత్వంలా నిరుద్యోగులను మేం భారంగా భావించం
- వారికి ప్రపంచంతో పోటీపడేలా స్కిల్స్ నేర్పిస్తం
- అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడి.. సీఐఐ ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రమంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘మెగా మాస్టర్ పాలసీ–2050’ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తున్నదన్నారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలు, రాజకీయాలు వేరని, అభివృద్ధి వేరని పేర్కొన్నారు. 24 గంటలూ తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవచ్చని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించారు. తమతోనూ, ప్రభుత్వ ప్రతినిధులైన అధికారులతోనూ మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని అన్నారు. శనివారం సెక్రటేరియెట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశ(నెక్స్ట్ లెవల్ డెవలప్మెంట్) చేరుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకంతకు విలువ కూడా ఉంటుందని చెప్పారు. పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఆయన కోరారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్ గా, ఆర్ఆర్ఆర్ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని సీఎం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదనే అపోహలు వద్దని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని ఆయన హితవు పలికారు.
యూత్కు ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించటం లేదని సీఎం రేవంత్ చెప్పారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యూత్కు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని చెప్పారు.
వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీ
ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవలప్ చేస్తామన్నారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్ ఇట్ల అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని డెవలప్ చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు జరగాలని సూచించారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులు సి. శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, డాక్టర్ మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్ చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షామి ఉద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.