హైదరాబాద్, వెలుగు: కొవిడ్తో రెండేండ్లుగా దెబ్బతిన్న ఇండస్ట్రీలు ప్రొడక్షన్ను పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం 90 శాతం కంపెనీలు వందశాతం తయారు
చేస్తుండడంతో లేబర్ అవసరం పెరిగింది. దీంతో మళ్లీ డిమాండ్ వచ్చింది. లాక్డౌన్లో సొంతూళ్లకు వెళ్లిపోయిన వారినే మళ్లీ పలు ఇండస్ట్రీలు పిలుస్తున్నాయి. దీంతో సొంతూళ్ల నుంచి వలస కూలీలు తిరిగి సిటీకి వస్తున్నారు. రెండు నెలలుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వర్కర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 12 లక్షల మందికిపైగా వర్కర్లు జీడిమెట్ల, ఇస్నాపూర్, కాటేదాన్, పాశమైలారం, బొల్లారం, చర్లపల్లి, మంఖాల్, బాలానగర్, కొత్తూరు పారిశ్రామిక వాడల్లో 6 వేలకుపైగా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు వర్కర్లు గతంలో పనిచేసే వారు. ఇందులో 6 లక్షల మందికిపైగా కార్మికులు ఇతర రాష్ట్రాల వారే పనిచేసేవారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లతో 70 శాతం మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో స్థానిక లేబర్లతో కంపెనీలు పని చేయించాయి. ఇప్పుడు పని పెరగడంతో మ్యాన్ పవర్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల వర్కర్లపై ఫోకస్ పెట్టారు. కొందరు ఏకంగా సొంత వెహికల్స్ని ఆయా రాష్ట్రాలను పంపి వర్కర్లను తీసుకొస్తున్నారు. గతంలో ఉన్నట్టే శాలరీలు, అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం పారిశ్రామిక వాడలు మళ్లీ వర్కర్లతో సందడిగా కనిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచే ఎక్కువ
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు గతంలో పనిచేసిన కంపెనీల్లోనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బిహార్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్
రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. కరోనా కారణంగా ఇక్కడి నుంచి పోయి చాలా ఇబ్బందులు పడ్డామని, ఇకనైనా చేతినిండా పని దొరికితే చాలని కార్మికులు
అనుకుంటున్నారు.
డిమాండ్ ఉండగా పిలుస్తున్నం
కరోనా వల్ల కంపెనీలు మూతపడడంతో వర్కర్లు సొంతూళ్లకు వెళ్లారు. అప్పట్లో మేము వర్కర్లను ఆపేందుకు ప్రయత్నించాం. అయినా చాలా మంది ఉండకుండా వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ పనికి డిమాండ్ ఏర్పడడంతో రమ్మని పిలుస్తున్నాం. చాలా మంది తిరిగి వస్తున్నారు.
- సునీల్, ఓ కంపెనీ ఓనర్, కాటేదాన్
మళ్లీ వచ్చిన..
కరోనాకు ముందు పాశమైలారంలోని ఓ కంపెనీలో కాంట్రాక్టర్ దగ్గర పని చేసిన. లాక్ డౌన్ లో ఊరికి వెళ్లిన. ఆ తర్వాత ఇక్కడకు రాలే. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ చేసి రమ్మన్నడు. మళ్లీ పని దొరకడంతో తిరిగొచ్చిన. అప్పట్లో పడిన ఇబ్బందులు తిరిగి రావద్దు.
- జ్ఙానేశ్వర్, వర్కర్, మహారాష్ట్ర
ఊరివాళ్లతో కలిసొచ్చిన..
బాచుపల్లిలోని ఫార్మా కంపెనీలో పని ఉందని వచ్చిన. మా ఊరి వాళ్లు గతంలో ఇక్కడ పనిచేసేవారు ఉన్నారు. వాళ్లు వస్తుండగా నేను వచ్చిన. ఇన్నాళ్లు ఊర్లనే వేరే పనిచేసిన. ఇక్కడ అయితే కాస్తా ఎక్కువ సంపాదిస్తానని వచ్చిన. ఇప్పుడు జాయిన్ అయి నెలరోజులైంది.
- రంగా,వర్కర్, ఒరిస్సా