
- కలెక్టరేట్లో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం ఏమిటి?
- బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి
ఘట్కేసర్, వెలుగు: రాష్ట్రంలో ఓ మంత్రి, కలెక్టర్ ముందే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరగడం సిగ్గుచేటని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ శోభతో కలిసి ఆమె మాట్లాడారు. తెలంగాణలో కీచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. 27న జరిగిన సమావేశంలో మహిళా ఎంపీటీసీ అని కూడా చూడకుండా ఆమెను బీఆర్ఎస్నేతలు బయటకు నెట్టడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ మహిళా కమిషన్ నిద్ర పోతున్నదా అని ప్రశ్నించారు. గతంలో గవర్నర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత కామెంట్స్చేసి ఢిల్లీకి పోయి కేంద్ర మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ విషయంపై తాను జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని గీతామూర్తి వెల్లడించారు.
ఎంపీటీసీ శోభ మాట్లాడుతూ.. శనివారం జరిగిన సమావేశంలో నేను మాట్లాడొచ్చా అని అడగడంతో మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ తాను మాట్లాడడానికి వీల్లేదన్నారు. ఆయన చెప్పింది మాత్రమే వినాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికలను అలంకరించి ముస్తాబు చేయాలని, సినిమా హీరోయిన్లతో పబ్లిసిటీ ఇప్పించాలని ఆయన అన్నారని ఎద్దేవా చేశారు. ఘట్కేసర్ లో రైతుల వడ్లు కొనడానికి చేతకాదు కానీ రైతు వేదికలకు ముస్తాబు చేయడం ఎందుకని తాను ప్రశ్నించానని, దీంతో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు వచ్చి సమావేశంలో నుంచి బయటకు నెట్టేశారని శోభ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా సెక్రెటరీ నిర్మలా రెడ్డి, సుధారాణి, సుధాకర్, మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.