ముషీరాబాద్, వెలుగు: భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమండ్ల చెన్నయ్య డిమాండ్ చేశారు. మాల మహానాడు పోరాటంతోనే అంబేద్కర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అరెస్ట్ అయ్యాడని తెలిపారు. కల్పిత నాయకుడు పుస్తక రచయిత హమారా ప్రసాద్ అరెస్ట్ అయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ హమారా ప్రసాద్ కేవలం డబ్బు కోసమే ఇలాంటి పుస్తకాన్ని రాశాడని విమర్శించారు. అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరిస్తే మాల మహానాడు చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
