హైదరాబాద్, వెలుగు: గోదావరి పుష్కరాలకు మెరుగైన వసతులు కల్పిస్తామని టీజీటీడీసీ ఎండీ గౌతమి తెలిపారు. పీపీపీ, ఈ–ప్రొక్యూర్మెంట్ విధానంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు అర్హులైన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు శుక్రవారం పేర్కొన్నారు. పుణ్యక్షేత్రాలైన బాసర, కాళేశ్వరం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేందుకు అత్యాధునిక మల్టీమీడియా ‘సౌండ్ అండ్ లైట్ షో’లను ఏర్పాటు చేస్తామన్నారు.
పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల భద్రతకు పడవలు, మ్యాజిక్ ఫ్లోటింగ్ జెట్టీలు, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ ట్యూబ్ల వంటి రక్షణ పరికరాల కొనుగోలుకు ప్రత్యేక టెండర్లు ఆహ్వానించామన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం వద్ద పీపీపీ విధానంలో రివర్ఫ్రంట్ 'ఫైవ్స్టార్ రిసార్ట్', బడ్జెట్ హోటల్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల కోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో డబుల్ డెక్కర్ ‘హాప్–ఆన్ హాప్–ఆఫ్’ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపడుతున్న ఈ ప్రాజెక్టులకు ఆసక్తి గల సంస్థలు ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా బిడ్లు దాఖలు చేయవచ్చని సూచించారు.
