మత్స్యకారులకు రూ. 5 లక్షల బీమా.. అర్హులు ఎవరంటే..?

మత్స్యకారులకు రూ. 5 లక్షల బీమా.. అర్హులు ఎవరంటే..?

మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని 5,200 మంది మత్స్యకారులు, మహిళా మత్స్య సహకార సంఘాల్లోని 3 లక్షల మందికిపైగా సభ్యులకు మేలు జరగనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయినా, తప్పిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందనుంది. ఈ డబ్బులు 180 రోజుల్లో బాధిత కుటుంబాలకు  అందనున్నాయి. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రీమియం డబ్బులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించనున్నాయి.

ఈ పథకానికి రిజిస్టర్ అయిన మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స సహకార సంఘాల సభ్యులతో పాటు మత్స కార్మికులు, చేపల పెంపకం దారులు, ఫిషింగ్ సంబంధిత అనుబంధ పనులకు సంబంధించి ప్రత్యక్షంగా పాల్గొనేవారు అర్హులు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 5 లక్షల క్లెయిమ్ పొందొచ్చు. శాశ్వత పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.2.5లక్షలు, హాస్పిటల్ లో చేరితే రూ. 25 వేలు చెల్లించనున్నారు.

సముద్రం, రోడ్డు,రైల్వే ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే ఈ స్కీమ్ వర్తిస్తుంది. చెరువులు, కుంటలలో, నీటి వనరులలో మునిగిపోవడం, తప్పిపోవడం, విషపూరిత పదార్థాల నిర్వహణ వల్ల ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయినా, అవయవాలు దెబ్బతిన్నా స్కీమ్ వర్తిస్తుంది. మెరుపు, కరెంట్ షాక్ తో పాటు మిషనరీతో పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగినా, ఎత్తు నుండి పడిపోయి చనిపోయినా, హత్య , అల్లర్లు, పాము, తేలు, కుక్కకాట్ల వల్ల ప్రమాదం జరిగినా... అవయవాలు కోల్పోయినా పథకం వర్తించేలా విధివిధానాలు తయారు చేశారు.

ఇన్సూరెన్స్ కోసం మత్స్యకారులు ప్రమాద బీమా ఫారంను నింపి అందులో సభ్యుని వివరాలు, నామిని వివరాలు వ్రాసి డిస్ట్రిక్ ఫిషరీస్ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది. మత్స్యకారులు ఇచ్చిన ఫామ్ ను ఆఫీసర్లు ఆన్లైన్ లో ఎంటర్ చేసి స్టేట్ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కలిగిన సభ్యుడికి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం వారం రోజుల్లో డిస్ట్రిక్ ఫిషరీస్ ఆఫీస్ ను సంప్రదించాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను 90 రోజుల్లో అందిస్తే నామిని అకౌంట్ లో 180 రోజుల్లో బీమా డబ్బులు జమ అవుతాయి.