ఫస్ట్ ఇయర్ ను బట్టే సెకండియర్ మార్కులు..

ఫస్ట్ ఇయర్ ను బట్టే సెకండియర్ మార్కులు..


హైదరాబాద్, వెలుగు:  కరోనా తీవ్రత నేపథ్యంలో వాయిదా పడ్డ ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఇంకా డౌటే ఉంది. జూన్‌‌ ఫస్ట్ వీక్‌‌లో అప్పటి  పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో జూన్‌‌లో ఎగ్జామ్స్ పెట్టడం సాధ్యమవుతుందా? అని సర్కార్ ఆలోచిస్తోంది. ఒకవేళ సాధ్యం కాకపోతే, ఏం చేయాలనే దానిపై ఇంటర్ బోర్డు ప్లాన్ రెడీ చేస్తోంది. ఎగ్జామ్స్ పెట్టడం సాధ్యం కాకపోతే.. ఇప్పుడున్న సెకండియర్ స్టూడెంట్లకు.. ఫస్టియర్​లో వచ్చిన స్కోర్ ఆధారంగా మార్కులు వేయాలని ఆలోచిస్తోంది.  

 ఫస్టియర్ కు కష్టమే.. 

మేలో ఇంటర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా, కరోనా కేసుల నేపథ్యంలో.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లను ప్రమోట్ చేస్తూ, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. జూన్ ​ఫస్ట్ వీక్​లో సెకండియర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని.. పరిస్థితులు అనుకూలిస్తే ఫస్ట్ ఇయర్ వాళ్లకూ ఎగ్జామ్స్ పెడతామని వెల్లడించింది. కానీ ఫస్టియర్‌‌ కు పరీక్షలు పెట్టడం కష్టమేనని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆ స్టూడెంట్లకు మరో ఏడాది చాన్స్ ఉన్నందున, ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. కానీ సెకండియర్ వాళ్లకు మాత్రం తప్పకుండా ఎగ్జామ్స్ పెట్టాలి.. లేదంటే ఏదో ఒక విధానంలో మార్కులు వేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే ఏం చేయాలనే దానిపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషిస్తోంది. కాగా, అవకాశముంటే ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రకటన.. ప్రైవేట్ కాలేజీలకు ఫీజులు వసూలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చేందుకేననే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు... 

ప్రస్తుతం సెకండియర్ లో ఉన్న స్టూడెంట్లు పోయినేడాది ఫస్టియర్‌‌లో ఎగ్జామ్స్ రాశారు. కేవలం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ​మాత్రమే జరగలేదు. దీంతో ఫెయిలైనోళ్లందరినీ మినిమమ్ మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి జూన్ లో సెకండియర్ ఎగ్జామ్స్ సాధ్యం కాకపోతే.. జులై ఫస్ట్ వీక్‌‌ వరకు వేచి చూడాలని సర్కార్ భావిస్తోంది. సీబీఎస్ఈ బోర్డు తీసుకునే నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటోంది. ఒకవేళ జూన్, జులైలోనూ పరీక్షలు సాధ్యం కాకపోతే.. ఫస్టియర్‌‌లో స్టూడెంట్లకు వచ్చిన మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను వేయాలని  యోచిస్తోంది. ఇంటర్ బోర్డు ఇచ్చే మార్కులపై ఎవరికైన అభ్యంతరం ఉంటే, వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సైన్స్‌‌ స్టూడెంట్లకు ప్రాక్టికల్ మార్కులనూ వారి రికార్డుల ఆధారంగా వేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ కూడా ఎత్తివేయడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు భావిస్తున్నారు. అయితే పరీక్షలు పెట్టాలని భావిస్తే, స్టూడెంట్లకు కనీసం15 రోజుల గడువు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ15 రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహణ ఏర్పాట్లు కష్టమేనని అధికారులు చెప్తున్నారు. దీంతో పరీక్షలు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.