అమ్మ గెలుపు కోసం.. లండన్ నుంచి జమ్మికుంటకు కూతురు

అమ్మ గెలుపు కోసం.. లండన్ నుంచి జమ్మికుంటకు కూతురు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని, 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన కొక్కుల శ్రీలత కేదారీశ్వర్ గెలుపు కోసం ఆమె ఏకైక కుమార్తె లండన్ నుంచి జమ్మికుంట వచ్చింది. సుంకేనపల్లి మాధురి లండన్‌లో స్థిరపడినప్పటికీ, తన తల్లికి మద్దతుగా నిలిచేందుకు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏకంగా ఖండాంతరాలు దాటి స్వగ్రామానికి చేరుకుంది.

కేవలం తాను రావడమే కాకుండా, తన ఎనిమిది నెలల పసికందు నిత్యశ్రీని కూడా వెంటబెట్టుకుని రావడం అక్కడి ఓటర్లను విశేషంగా ఆకర్షించింది. తన తల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో పాటు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పేలా మాధురి తీసుకున్న ఈ నిర్ణయం మాతృమూర్తికి అండగా నిలుస్తూ ఆమె చేసిన ప్రచారం వార్డులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.