ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య లష్కర్​ ఫైట్

ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య లష్కర్​ ఫైట్
  •    ఇంట్రెస్టింగ్​గా సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం ఎన్నిక
  •     బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్​ ఎంపీ కిషన్​రెడ్డి
  •     కాంగ్రెస్ ​నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్​
    •     బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​

హైదరాబాద్, వెలుగు : ఇద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్​ఎంపీ మధ్య పోటీతో సికింద్రాబాద్​పార్లమెంట్​నియోజక వర్గ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో బీజేపీ తరఫున సిట్టింగ్​ ఎంపీ కిషన్​రెడ్డి బరిలో నిలిచారు.  బీఆర్ఎస్​ పార్టీ తరపున  సికింద్రాబాద్​ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్​ తరపున ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ పోటీలో ఉన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లోకి వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్​తరఫున ఖైరతాబాద్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్​కాంగ్రెస్​లో చేరగా, ఆయనకు సికింద్రాబాద్​పార్లమెంట్​ టికెట్ కేటాయించారు. సమీకరణాలు అంచనా వేసుకొని సికింద్రాబాద్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే పద్మారావుకు బీఆర్ఎస్​ ఎంపీ టికెట్​ ఇచ్చింది. ఇక సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్‌‌‌‌రెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది.  

ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్​ సిట్టింగ్​ ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్​ ఎంపీ మధ్య ఫైట్​ జరుగనున్నది. మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారడం, ఆయనను ఎదుర్కొనేందుకు మరొక ఎమ్మెల్యే రంగంలోకి దిగడం.. బీజేపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్​ ఎంపీగా ఉన్న కిషన్​రెడ్డి తో వీరు తలపడుతుండటం.. ‘లష్కర్​’ ఎన్నిక సర్వత్రా ఆసక్తి పెంచుతున్నది.