- సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్లాన్
- సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఒకే గొడుగు కిందకు సేవలు
- ధరణి మాడ్యూల్స్ గందరగోళానికి చెక్ :
- మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు : ఇంటిగ్రేటెడ్ భూభారతి (డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి పైలట్ప్రాజెక్టు కింద ఐదు మండలాల్లో అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
గురువారం రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ ఆఫీసర్లతో సెక్రటేరియట్లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
నారాయణపేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా ఆమనగల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు.
ఈ మండలాల్లో వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేసి, రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు భూభారతి చట్టాన్ని తెచ్చామని, వ్యవసాయ భూముల క్రయవిక్రయాల సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతీ సర్వే నంబర్కు భూధార్..
ఈ ఐదు మండలాల్లో ప్రతీ సర్వే నంబర్కు ఆధార్ తరహాలోనే భూధార్ నంబర్ను కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే నక్ష లేని ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, భూధార్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ఒక్క క్లిక్తో రైతుల భూములకు సంబంధించిన పూర్తి సమాచారం లభించేలా పోర్టల్ను రూపొందించామని, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు పొందవచ్చని చెప్పారు. ధరణిలో 36 మాడ్యూల్స్ ఉండగా.. వాటి గందరగోళానికి చెక్పెడుతూ భూభారతిలో అన్నింటినీ ఒకే చాప్టర్ కిందకు తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.
పోర్టల్ద్వారా అందే సేవలు
ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో ప్రధానంగా సమాచారం, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ తోపాటు సిటిజన్ డ్యాష్ బోర్డు సేవలకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్, భూధార్ నంబర్, దరఖాస్తు వివరాలు, మ్యుటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతీ సర్వే నంబర్కు మ్యాప్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం లభించేలా చూస్తున్నామని తెలిపారు. రి
జిస్ట్రేషన్, ఇతర భూ సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతీ స్టేజ్ లో వివరాలను తెలియజేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారుడికి సమాచారం అందిస్తామన్నారు. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు.
