
అహ్మదాబాద్: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించిన ఐపీఎల్–18 అట్టహాసంగా ముగిసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్కు ముందు జరిగిన క్లోజింగ్ సెర్మనీ కలర్ఫుల్గా సాగింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న త్రివిధ దళాల సైనికులకు సెల్యూట్ చేస్తూ సాగిన కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని నింపింది.
బాలీవుడ్ టాప్ సింగర్ శంకర్ మహదేవన్, అతని కుమారులు సిద్ధార్థ్, శివమ్ ఆలాపించిన యుద్ధ నేపథ్య చిత్రం లక్ష్యలోని ‘కంధోన్ సే మిల్లే హై కాందే, ఏ వతన్ మేరే ఆబాద్ రహే తు, వందేమాతరం (ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన), సబ్సే ఆగే హోంగే హిందుస్తానీ, దుష్మాన్ కే చక్కే చుడా దే, హమ్ ఇండియా వాలే’ పాటలకు స్టేడియం హోరెత్తింది.
స్టేడియంలోని డిజిటల్ బోర్డులో.. భారత సాయుధ దళాలను గౌరవించడం, సాయుధ దళాలకు సెల్యూట్, సాయుధ దళాలకు ధన్యవాదాలు’ అనే సందేశాలు ప్రదర్శించారు. ఐసీసీ చైర్మన్ జై షా, యూకే మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ దంపతులు, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో కలిసి మ్యాచ్ను వీక్షించారు. భారత వాయుసేన విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యకిరణ్ విమానాలు గాల్లో దూసుకుపోతూ త్రివర్ణ పతాకం రంగులను వెదజల్లడం అందర్నీ ఆకట్టుకుంది. ఇండియా, త్రివిధ దళాలకు సంబంధించిన ఫ్లాగ్స్తో స్టేడియంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి.
స్టేడియంలో ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ సాయుధ బలగాల పరాక్రమానికి జేజేలు పలుకుతూ కనిపించారు. గ్రౌండ్లో వేసిన వేదికపై కళాకారులు త్రివర్ణంతో కూడిన డ్రెస్లను ధరించి తమ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. వెస్టిండీస్ డాషింగ్ హిట్టర్ క్రిస్ గేల్ పంజాబ్ టర్బన్, ఆర్సీబీ జెర్సీ, ఫైర్ షూస్తో స్టేడియంలో దర్శనమిచ్చాడు. రెండు జట్లకు తాను మద్దతిస్తున్నానని చెప్పాడు.