ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. టోర్నీ డేట్స్ ఫిక్స్

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. టోర్నీ డేట్స్ ఫిక్స్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. టోర్నీ నిర్వహణకు సంబంధించిన డేట్స్‌పై క్లారిటీ వచ్చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మూడు వేదికల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. దుబాయ్, అబు దాబితోపాటు షార్జాలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు టోర్నీ నిర్వహణకు ప్లాన్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కన్ఫర్మ్‌ చేశారు. ‘సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ టోర్నీని నిర్వహిస్తాం. ఇది అఫీషియల్. దీనికి సంబంధించి ఇవ్వాళ ప్రకటన చేస్తాం. మరో వారంలో గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తాం’ అని బ్రిజేష్ చెప్పారు.

గ్రౌండ్స్‌లో లైవ్‌లో మ్యాచ్‌ను తిలకించడానికి కనీస సంఖ్యలో అయినా క్రికెట్ ప్రేక్షకులను అనుమతించడంపై యూఏఈ ప్రభుత్వమే డెసిజన్ తీసుకుంటుందని బ్రిజేష్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏప్రిల్–మే విండోలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయడంతో ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అయింది. దేశంలో కరోనా విజృంభిస్తున్నందున ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది.