
- పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
- ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయింపు
- ప్రియాన్షు ఆర్య, ప్రభ్సిమ్రన్ హాఫ్ సెంచరీలు
ధర్మశాల: పాకిస్తాన్ దాడులకు దిగడంతో ధర్మశాల బ్లాక్ఔట్గా మారిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్ల చెరో పాయింట్ కేటాయించారు. ధర్మశాలకు పొరుగున ఉన్న జమ్మూ, పఠాన్ కోట్లో దాడులు జరగడంతో ధర్మశాలలో కరెంట్ను ఆపేశారు. మొదట ఫ్లడ్లైట్ల సమస్య అని చెప్పినా తర్వాత పాక్ దాడులు మొదలుపెట్టడంతో వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు. అంతకుముందు వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన పంజాబ్ 10.1 ఓవర్లలో 122/1 స్కోరు చేసింది. ప్రియాన్షు ఆర్య (34 బాల్స్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70), ప్రభ్సిమ్రన్ సింగ్ (28 బాల్స్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) చెలరేగారు.
తొలి రెండు బాల్స్ను ఫోర్లుగా మల్చిన ఆర్య ఉన్నంతసేపు ఢిల్లీ బౌలర్లను దంచికొట్టాడు. రెండో ఓవర్లో మరో ఫోర్తో జోరు పెంచగా, మూడో ఓవర్లో ప్రభ్ మూడు ఫోర్లతో గాడిలో పడ్డాడు. నాలుగో ఓవర్లో ఆర్య 6, 4, 6తో 18 రన్స్ రాబట్టాడు. అక్షర్ వేసిన ఐదో ఓవర్లో ఇద్దరు ఓ ఫోర్, సిక్స్ బాదారు. నటరాజన్ కొద్దిగా కంట్రోలు చేయడంతో పవర్ప్లేను పంజాబ్ 69/0 స్కోరుతో ముగించింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఆర్య వెనక్కి తగ్గలేదు. ఏడో ఓవర్లో సిక్స్తో 25 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా రన్స్ను నియంత్రించడంలో ఫెయిలయ్యాడు. 9వ ఓవర్లో ప్రభ్ రెండు ఫోర్లతో 28 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు. 10వ ఓవర్లో ఆర్య రెండు సిక్స్లు కొట్టడంతో స్కోరు 122/0కి పెరిగింది. కానీ 11వ ఓవర్లో నటరాజన్ వేసిన స్లో బాల్ను షాట్గా కొట్టే ప్రయత్నంలో ఎడ్జ్ తీసుకోవడంతో షార్ట్ థర్డ్లో తివారీ చేతికి చిక్కాడు. స్కోరు 122/1గా మారింది. ఈ దశలో సాంకేతిక సమస్యతో ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఒక్క ఫ్లడ్ లైట్ మాత్రమే పని చేసింది. దీంతో మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేశారు.
ప్లేయర్ల కోసం ప్రత్యేక రైలు
మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ను తక్షణమే ఖాళీ చేయించారు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రసార సిబ్బందిని సురక్షితంగా హోటల్కు తరలించారు ‘ప్లేయర్లందర్ని పఠాన్ కోట్కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తాం. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలిస్తాం. ప్రస్తుతానికి మ్యాచ్ రద్దైంది. రేపటి పరిస్థితిని బట్టి టోర్నీ భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి మాకు ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యమైంది’ అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. అన్ని ఫ్రాంచైజీల్లో ఉన్న విదేశీ ప్లేయర్లు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో పాటు తాజా పరిణామాల దృష్ట్యా లీగ్ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లీగ్ రద్దు గురించి ఎలాంటి సంకేతాలు లేవని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. వాటాదారుల ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్నో, బెంగళూరు మ్యాచ్ నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి సందేహాలు లేవన్నారు.